Sunday, December 26, 2010

శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం

నిన్న నా జీవితం లో మరచిపోలేని ఒక అద్భుత దర్శనం జరిగింది. విజయనగరం లో శ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ఆలయాన్ని కట్టి రెండు మూడేళ్ళు అవుతున్నట్టు ఉంది. నా ఫ్రెండ్/పార్టనర్ విజయ్ ఇంతకు ముందు ఒకసారి దర్శనం చేసుకొన్నాడు. సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక దర్శనం ఉంటుందని అంటే.. సరిగ్గా ఆ టైము కి శివాలయానికి వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకొని, ఆ లోపల మా మిగతా పనులు ముగించుకొని, ఆరయ్యే సరికి శివాలయం దగ్గర వున్నాం. మాతో పాటూ మా క్లయింట్ (ఆయన ఆలయ కమిటీ మెంబరు కూడానట) కూడా వచ్చారు. శివ లింగం స్ఫటికమని చెప్పారు. నేను ఇంతకు ముందు (రామేశ్వరం లో అనుకుంటాను..) ఒక చోట స్పటిక లింగం చూసాను. చిన్నది..దాని వెనుక దీపం పెట్టారు. స్ఫటికం లోనుండి..ఆ కాంతి మనకు కనిపిస్తుంది.!! నేను కూడా అలానే ఊహించుకొంటూ వెళ్ళాను. కానీ ఇక్కడి శివలింగం..పానవట్టమే ఎత్తు సుమారు మూడడుగులుంది. స్ఫటికం బయటకు లింగాకృతి లో ఒకటిన్నర అడుగులు కనిపిస్తుంది. లింగం వెండి తొడుగుతో కప్పబడి (నాకు మొదట తెలీదు), దానిమీదనే పరమేశ్వర ముఖాకృతి (లింగం నలు వైపులా నాలుగు) చెక్కబడి ఉంది. వెండికట్టు కట్టిన రుద్రాక్ష మాలలతోనూ, వివిధ రకాలైన పుష్పాలతోనూ అలంకరించబడి ఉంది. ప్రధాన ఆలయానికి ఆనుకొని వున్న మంటపంలో ఉపాలయాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలనూ ప్రతిష్టించారు. గర్భాలయానికి చేరోవైపూ, విజయ గణపతి మరియు అపర్ణాదేవి ఆలయాలున్నాయి.

మేము వెళ్ళే సరికి అర్చకులు ఇక్కడ వేంచేసి వున్న స్వామిని గురించీ, అప్పుడు జరగబోయే స్పటిక లింగ దర్శనం విశిష్టతను గురించి మైకు లో అనౌన్స్ చేస్తున్నారు. స్వామి శ్రీ పశుపతి నాధేశ్వరునిగా కొలువు తీరారు. ప్రొద్దున్న 6:30 నుంచి, ఎనిమిదిన్నర వరకూ స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం నాలుగు ముఖాలతో అలరారే వెండితోడుగుని లింగం పై కప్పి వుంచి సాయంత్రం మళ్ళీ ఆరుగంటలకి హారతి, స్పటిక లింగ దర్శనం ఉంటాయట. దర్శనానికి వచ్చిన భక్తులందరూ వరుసలోమూల విరాట్టుకీ నందీశ్వరునికీ మధ్యత్రోవ వదలి ఇరుప్రక్కలా కూర్చొన్నారు. అర్చక స్వాములు ఒకరు ఘంట, ఇంకొకరు ఢమరుకం, వేరొకరు డప్పు లయబద్ధంగా మ్రోగిస్తూ వుండగా, స్వామివారి సాయంత్రపు హారతి మొదలైంది. ఆ వాద్య ఘోషలో ఓంకారం వినిపిస్తూండగా, ఆ లయలో లీనమౌతూ ఆ నాదాన్ని వింటున్నకొద్దీ.. ఒకరకమైన గగుర్పాటు..! ఒక రకమైన పరవశంతో చేతులు నాకు తెలియ కుండానే ' తక తకిట.. ,తక తకిట.. ' అంటూ ఖండ గతిలో వున్న ఆ లయని అనుసరించ సాగాయి..!!

అర్చనానంతరం..హారతి అంతా దాదాపు ఇరవై నిముషాలపాటూ సాగింది. మొదట ఎదురుగావున్న స్వామివారి ముఖానికి హారతిచ్చి, భక్తితో స్వామికి ప్రణమిల్లి, రెండవముఖం ఎదురుగా వచ్చేలా వెండి తోడుగుని జరిపి, మరలా దానికి హారతిచ్చారు. అలా పశుపతి నాధుని నాలుగు ముఖాలకీ ప్రత్యేక హారతిచ్చారు. తరువాత ఆలయం లో వున్న విద్యుద్దీపాలన్నిటినీ ఆపివేసి.. వేద మంత్రోచ్చారణ నడుమ, 'హరహర మహాదేవ శంభో శంకర' అని నామ ఘోష మార్మోగుతుండగా..స్వామికి కప్పబడి వున్న వెండి తోడుగుని తీసేశారు. ఒక్కసారిగా స్పటిక లింగ రూపం లో స్వామి దర్శనం..!! ఆహా..!! పరమాద్భుతం..! మాటలకందని ఆనందం!! దేదీప్యమానమైన కాంతులతో వున్న స్వామిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు.చీకటిలో చుట్టూ వెలిగే చిరు దీప కాంతుల మధ్య తెల్లటి వెలుగు తో వున్న వున్న స్పటికలింగాన్ని చూస్తే, కార్తీక పౌర్ణమి రోజున మినుకు మనే నక్షత్రాల మధ్య వెండి వెన్నెలల జాబిల్లి తలపుకి వచ్చినా , 'ఆహా! ఈ సుందరేశ్వరుడి సౌందర్యం ముందు, ఇంకే సౌందర్యమైనా దిగదుడుపే..!' అనిపించక మానదు. తెల్లవారు ఝామున.. కార్తీక స్నానాలకోసం నూతిగట్టు దగ్గరికి వెళ్లి, పైబట్టలు తీసి నిలబడ గానే, చల్లటి గాలికి ఒళ్ళు ఒక్కసారి జలదరించినట్టై, రోమంచితమవుతుంది చూడండి..!! అదే అనుభవం కలిగింది నాకు.

ఇక అర్చకులు మైకులో స్వామివారి వివిధ స్తోత్రాలనూ మొదలైన వాటిని చదువుతూ వుంటే.. అక్కడ వున్న భక్తులకూ..అవి ముద్రించి వున్న కరపత్రాలను పంచి అర్చకులతో గొంతు కలిపే అవకాశాన్ని కల్పించారు. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఒక రకమైన ట్రాన్స్ లో వున్నట్టనిపించింది.

స్తోత్ర గానం పూర్తి అవగానే అందరమూ లేచి.. ఉపాలయాలలోని ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిరూపాలనూ దర్శించుకొని స్ఫటికలింగానికి దగ్గరగా వెళ్లి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలూ, శఠారినీ పుచ్చుకోన్నాం. ఈలోపలే స్వామివారికి అలంకరణ కూడా పూర్తి అయింది.
ఇప్పుడు స్వామి వారికి,(స్పటిక లింగానికి) వెండి నామాలూ మధ్యలో నిలువుగా ఎర్రటి పోడులతో తాపడం చెయ్యబడిన..మూడవ నేత్రం, రుద్రాక్షలూ, అన్నీ అలంకరించారు..! ఇప్పుడింక స్వామివారి అందం ద్విగుణీకృతం అయింది. పునర్దర్శన ప్రాప్తి కోరుకొంటూ..అక్కడి నుంచి పక్కనే వేంచేసి వున్న లక్ష్మి, పార్వతీ సమేత జ్ఞాన సరస్వతీ దేవి దర్శనం కూడా చేసుకొని మెల్లగా బయలు దేరి విశాఖపట్నానికి తిరుగుప్రయాణమయ్యాం.
శ్రీ పశుపతి నాధేశ్వరాలయం మరియు జ్ఞాన సరస్వతీ ఆలయం లోనికొన్ని చాయా చిత్రాలను చూడడానికి ఈ లింకు నొక్కండి: http://travel.webshots.com/album/576720508ahJGRe

ravi7us గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఫోటోల లింక్ ఉపయోగిస్తున్నానని వారికి చెప్పి అనుమతి కోరడానికి లింక్ లో వారి ఈమెయిలు ఏమీ కనిపించక పోవడం చేత..ఇలా బ్లాగ్ ద్వారానే ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ ఆలయాన్ని గురించిన ఇంకొన్నివివరాలూ , కరపత్రాలూ స్కాన్ చేసి మళ్ళీ ఇదే పోస్ట్ లో పెడతాను.
పూర్తిగా చదవండి...

Friday, December 17, 2010

తంబురా శ్రుతి..!!

పనిచేసుకొనేప్పుడు కూనిరాగం తీయని వాడు ఉండడు. అందునా శాస్త్రీయ సంగీతం నేర్చుకొనీ కూనిరాగాలు తీసేసే వాళ్లకి తంబురా శ్రుతి వింటూ పాడుకొంటే వుండే ఆనందమే వేరు...! కంప్యూటర్ లోనూ, కారులో.. శ్రుతి ఎక్కడ వస్తుంది చెప్పండి..!! మనసు రాగాల పల్లకి లో ఒలలాడుతూవుంటే శ్రుతి చక్కని పిల్లతిమ్మెరలా హాయినిస్తుంది. చక్కగా అందుబాటులో ఉండేలా శ్రుతి బాక్స్ టూల్ దొరికింది. దానిని ఫోన్ లో గానీ..లేక కంప్యూటర్ లోగానీ రన్ చేసుకొని అది వింటూ పాడుకోవడమే ఇంక..!! పైగా మన పాటని మనమే శ్రుతి సహితం గా రికార్డు కూడా చేసుకోవచ్చు.


క్రింద లింక్ ని నొక్కి ఈ టూల్ ని డౌన్లోడ్ చేసుకొని ఆనందించండి..!!!


దీనిలో అదనపు ఆకర్షణ ఏంటంటే.. అన్ని శ్రుతులూ.. ఒక నిమిషం, ఎనిమిది నిమిషాల నిడివిలో wave sound format లో లభ్యం అవుతోంది..! మనకు కావలసిన నిడివిలో ప్లే చేసుకోవచ్చు...!!

అలాగే క్రొత్తగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టేవారికోసం సరళీ స్వరాలనుంచీ కృతుల వరకూ కూడా వున్నాయి.



(దీనిగురించి ముందే తెలిసిన వాళ్ళు కొంచం వెనక్కి వుండండి..తెలియని వాళ్ళని ముందరకి రానియ్యండి మేష్టారూ..!!)
******
Android phone users can dowload from the following link or directly from android market:

పూర్తిగా చదవండి...

Tuesday, November 30, 2010

తనికెళ్ళ భరణి...పక్కన్నేను...!!


చెన్నై వెళ్ళడానికి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తూ వుండగా..తనికెళ్ళ భరణి కనిపించారు..!!! సినిమా వాళ్ళలో ప్రత్యేకించి వీరాభిమానం లేదుకానీ (ఒక్క ఎన్టీయార్ తప్ప) భరణి గారి నటన లో వైవిధ్యం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ లో టైమింగ్ నాకు చాలా నచ్చుతుంది. బ్లూ జీన్స్, ఎల్లో టీ - షర్టు వేసుకొని, laptop బాగ్ లాంటిది భుజాన తగిలించుకొని...తన ఫ్రెండ్ (అనుకుంటా )తో మాట్లాడుతూ.. సెక్యూరిటీ చెక్ కి వెళ్తున్నారు. ఒక పది మంది వెనుక గా నేనూ, మా ఫ్రెండ్ విజయ్ వున్నాం. నుదుట విభూతి పట్టీలతో నేను సినిమాల్లో చూసి ఊహించిన దాని కంటే చాలా different గా వున్నారు..!! వెళ్లి పలకరిద్దామా...వద్దా...అనే సందిగ్ధం లో పడ్డాను. సినిమా వాళ్ళు కదా..పలకరిస్తే లెవెలిచ్చేస్తారేమో..అని ఒకపక్క , ఆయన్ని ఎలాగైనా కలిసి మాట్లాడనే ఉత్సుకత ఒకపక్క...!! కానీ రెండోది కనబడకుండా మనసులో మూలగా చిన్న అహం / సంశయం.. ఆయన్ని సినిమా రంగానికి చెందినాయన గా మాత్రమే తెలిసిన మా ఫ్రెండ్ తో ఆయన గురించి చెప్తూ ( గుసగుసలే..) లైన్ తిరుగుతూ వుండగా ఒకరికొకరం ఎదురుపడ్డాం.
నేను చిన్ననవ్వు నవ్వి విష్ చేసాను... ఆయన కూడా పలకరించి సెక్యూరిటీ చెక్ కి వెళ్ళిపోయారు.. మా ఫ్రెండ్ ముందు చిన్న గర్వం ఫీల్ అయ్యాను.
మేము కూడా చెకింగ్ పూర్తి చేసుకొని lounge లోకి వెళ్ళాము. అక్కడ కాఫీ తాగుతూ వాళ్ళ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు.(అన్నట్లు.. ఇందాక చెప్పడం మర్చిపోయాను..!! తనికెళ్ళ భరణి గారి తో పాటూ సుబ్బారావు గారనీ ఆయన కూడా వున్నారు. మాకు వైజాగ్ లో ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది.) ఇంతలో సుబ్బారావుగారు నన్ను చూడడం, పలకరించడం తటస్థించింది. ఆయనదీ మాదీ ప్రొఫెషనల్ పరిచయం అవడం.. అదీ చాలా రోజుల తర్వాత కలవడం తో..కుశల ప్రశ్నలు అయ్యాకా..మాటల్లో ఆయన ఏదో పనిమీద భరణి గారితో కలిసి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పారు. వెంటనే నేను ఆయన్ని అడిగాను 'మరి మమ్మల్నీపరిచయం చెయ్యండీ '. ఆయన భరణి గారి దగ్గరకి తీసుకెళ్ళారు. నేను పరిచయం చేసుకున్నాను..ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన పక్కనే కూర్చున్నాను.
'మీ అభిమానినండీ..' అన్నాను.. 'సినిమాలలో అనితర సాధ్యమైన మీ నటన చూసి మీకు చాలా మంది మీకు అభిమానులౌతారు..! కానీ నేను మీ లోని రచయితనీ, సాహితీవేత్తని చూసి మీకు అభిమానినయ్యను.!!' ఇలా మొదలయ్యాయి మా మాటలు...!!
వారు రాసిన 'ఎందఱో మహానుభావులు' (మొదట 'హాసం' పత్రిక లో ధారావాహిక గా వచ్చి.. పుస్తకంగా మళ్ళీ ముద్రితమైనది.) నాకు చాలా నచ్చిన పుస్తకం. దానిలో అంతగా ప్రముఖులు కాని సంగీత విద్వాంసులను ఎందరినో పరిచయం చేసారు. ఆ పరిచయం కూడా రెండు మూడు పేజీలలో ఆ విద్వాంసుల జేవితంలోని ముఖ్యమైన ఘట్టాలని చిత్రిస్తూ , భరణి గారు చూపిన నాటకీయత, కథనంలో ఆ వడి..మనల్ని ఆగకుండా చదివేలా చేస్తాయి. ఇదే వారితో అంటే..'ఏదో.. కొంచం రిసెర్చ్ చేసి రాసాను లెండి...' అన్నారు..!! అలాగే వారు రాసిన 'ఆట గదరా శివా ' గురించి కూడా కొద్ది సేపు ముచ్చటించుకొని... మా ఫ్లయిట్లకి టైం అయిపోవడం తో..వారి దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరిపోయాం...!
(మళ్ళీ ఇంటికి వచ్చిన వారానికి అనుకుంటా.. ' తనికెళ్ళ భరణి పాతికేళ్ళ సినీ ప్రస్థానం ' అంటూ సుమారు అన్ని పేపర్లూ చానెల్స్ లోనూ, వారితో ఇంటర్వ్యూలూ, ప్రత్యేక కథనాలూ వచ్చాయి ..! ఇంచుమించుగా అదే సమయంలో నేనాయన్ని కలవడం కాకతాళీయమైనా అదో మంచి ఫీలింగ్...!!) తీరా ఆయన వెళ్ళిపోయాక...బుర్రకి వెలిగింది.. ఆయన ఆటోగ్రాఫ్ కానీ, కలిసి ఫోటో అయినా తీసుకోలేదే అని..! అయ్యో అనుకున్నాను..! నన్ను బాగా ఫీలవనిచ్చి... మా చర్చకి కి మౌన ప్రేక్షకుడైన నా స్నేహితుడు విజయ్..తన సెల్ ఫోన్లో తీసిన ఫోటో చూపించి..నన్ను థ్రిల్ లో ముంచేశాడు. దటీజ్ మై ఫ్రెండ్ విజయ్...!!
పూర్తిగా చదవండి...

Sunday, November 28, 2010

రాజకీయ ప్రేక్షకుడు..!!

ఈ మధ్యే ఓ మిత్రుడు ఒక sms పంపాడు. అది ఏమంటే : what is INDIA? A Nation where PIZZA reaches home faster than AMBULANCE and POLICE...! Where you get CAR LOAN @8% but EDUCATION LOAN @ 12%..!! Where a Kilo ONION is Rs. 24/- but SIM CARD is free..!!! Where people worship GODDESS DURGA.. but want to kill their GIRL CHILD. Olympic SHOOTER wins GOLD, Govt. gives 3 Crore, another SHOOTER dies fighting with TERRORIST, Govt. pays only 1 LAKH to that AMAR JAWAN's Family ..!!!! really Incredible INDIA....!!!!!
forward it until it reaches the PM
అదీ విషయం!!
అంతేనా అనేశారా..? చిన్న నవ్వు కూడా వచ్చిందా?? మావాడే.. సరీగా అర్ధం చేసుకోడు..! ఆవేశం ఎక్కువ..!!
అంతేనా.. అంటే ఇంకా వుందండీ..! అంటూ మరో ఇన్ని ఏకరువు పెడతాడు..!! ఇలాంటి చిన్న చిన్న విషయాలని భూతద్దం తో చూసి బుర్రపాడుచేసుకుంటాడు. ఈ sms చూసి నేను నవ్వొచ్చిందంటే.. వాడు బ్లడ్ బాయిల్ అయిపోతోందంటాడు..! PM గారు పాపం ఆయనే బోల్డు తలనెప్పుల్లో వుంటే ఇంకా ఇబ్బంది పెడతానంటాడు..వీడేం బాధ్యత గల పౌరుడండీ..!!
ఇప్పుడూ..
అట్టహాసంగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది...'వెయ్యో పదో లంచం తీసుకుంటూ red handed గా పట్టుబడ్డ ఫలానా..ACB వలలో చిక్కిన వైనం..' మొహం దాచుకుంటూ.. కెమెరా కంట పడకుండా తప్పించుకొనే ప్రయత్నం లో ఉన్న సగటు ఉద్యోగి.. !! ఆ మొహం సరిగ్గా కనపడేలా చేతుల్ని అడ్డం తీసే అధికారులూ..!! రోజంతా అదే చూపిస్తారు..!!!
ఇంకో పక్క లక్షల కోట్ల స్కాం లకు సూత్రధారులు..పాత్రధారులూ ఐన మన నాయకమ్మన్యులు..!! సాక్ష్యాలు అన్నీఎదురుగా కనిపిస్తున్నా...
బోరవిరుచుకొని మరీ 'నాకేమీ తెలీదు..ఇదంతా ప్రతిపక్షాల కుట్ర...' అని దబాయించేసి ( సారీ..ఉన్నమాట చెప్తే, అది 'నిజం' అవుతుంది కానీ.. దబాయింపు ఎందుకవుతుందీ?? అంచేత 'వక్కాణించి' అని చదూకోండి.. ) నవ్వుతూ..జోకులేస్తూ..కాలరెగరేసి మరీ దర్జాగా కారెక్కే L. మోడీలూ, కల్మాడీలూ !!
'కక్కుర్తి పడితే కడుపైనా నిండాలంటారు'... ఈ సామెత 'పై ఇద్దర్లో' మొదటాయనకి తెలిసినట్టు లేదు..బొత్తిగా మొహమాటం..!!
రెండో అతను ధర్మదాత !! తాను తినీ మరో పదిమందికి పెట్టే పుణ్యాత్ముడు..!! ఆ సామెతని పదిసార్లు చదూకొని మరీ తత్వం బోధపరుచున్న (స్వయం)కృషీవలుడు !! 'దేశాన్ని దోచేస్తున్నారో' యని అరవక్కర్లేదు కనీసం సణుగుడు వినిపించినా కూడా కారుదిగి మరీ ' చట్టం తన పని తాను చేసుకు పోతుంది..ఈ స్కాం తుదికంటా దర్యాప్తు జరిపించి..ఎంతటి వాడి మీదైనా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చే పెద్దమనిషి!!
దేశంలో ఇలాంటి మామూలు విషయాలకి ఆశ్చర్యపోయి, నోరెళ్ళబెట్టి, తెగాలోచించేసి, ఆవేశం తెచ్చుకోడం ప్రయోజకత్వం కాదురా అబ్బాయి అంటే మా వాడికి అర్ధం కాదేం...?? పాయింటు సరిగ్గా కాచ్ చేసినట్టు లేదు ..

బస్సు స్టాప్ లో జేబుకోడుతూ ఒక దొంగ దొరికాడనుకోండి..వాడిని అక్కడే స్తంభానిక్కట్టేసీ దేహశుద్ధి చేస్తాం..! కొన్నిప్రాంతాల్లో చచ్చేదాకా కొడతారు. అది మన జన్మహక్కు కదా..!! అదే ఏ MLA గారో, ముఖ్యమంత్రిగారో.. ఒక పెద్ద స్కాం చేసారనుకోండి..పాపం పదవి కూడా పోయిందనుకోండి..వారిని నెత్తి నెక్కించుకొని ఓటేసి మరీ వారిని మళ్ళీ ముఖ్యమంత్రి గానో కేంద్ర మంత్రి గానో..ప్రోమోట్ చేసేసి వారి ప్రయోజకత్వానికి..అంగీకార ముద్ర వేసేస్తాం. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా పెద్ద స్కాం చేసేసరికి.. చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బలాగా పాతది మర్చిపోతాం..!! ఈ పెద్దమనుషులంత గణిత శాస్త్ర వేత్తలు మరొకళ్ళు లేరు. అంకెల్లో ఒకదాని కంటే పెద్దది ఇంకోదాన్ని ఉపయోగం లోకి తెస్తున్నారు. కొత్త అంకె పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలా అని మన లెక్కెట్టుకొనే లోపల ఇంకా పెద్దది వాడుక లోకి తెచ్చేస్తున్నారు. ఈ తరహా applied mathematics మామూలు గణిత శాస్త్రవేత్తలకి చేత అవుతుందా చెప్పండి??
అయిదారేళ్ళ క్రితం 12 కోట్లు సోమ్ములుపోనాయి మరేటి సేత్తాం అంటూ మనకంటే ఎక్కువ ఆశ్చర్యం, అమాయకత్వం (ప్రెస్ మీట్ పెట్టి మరీ...) ఒలకబోసిన మంత్రి గారిని చూసి గుండెలు బాదేసుకున్నాడు మావాడు..!! ఇప్పుడీ లక్షా డెబ్భైఆరు వేల కోట్లు స్కాం చూసి ఏమైపోతాడో.. పాపం !!! నేనంటానూ...అయిదారేళ్ళలో 12 కోట్ల టర్నోవర్ ని, సున్నాలు చుట్టలేనంత స్థాయికి తీసుకెళ్లడం.. ఆహా!! ఏం ఘనత..ఏం అభివృద్ధి...!!!

ఇలాంటివి చూసీ జీర్ణించుకోలేక ఏదోరకంగా తన గొంతు విప్పాలనిపించీ బుల్లి తెర పంచాయితీకి (అదే మన TV Talk Show) వెళ్ళాడు. లోకల్ కాదండోయ్...నేషనలే!! అంత పేరున్నవాడు కాదు కాబట్టీ ప్రేక్షకుడిగా రానిచ్చారు. పానెల్ సభ్యులుగా ప్రముఖ రాజకీయ పార్టీల నుంచీ పేరెన్నిక గన్న పెద్దలూ, మేధావులూ..విచ్చేశారు.
టాపిక్ మొదలైనదే ఆలస్యం.. అందరూ ఒకటే అరుపులూ, కేకలూ.. ఎవరేం మాట్లాడుతున్నారో ఏమీ అర్ధం కాలేదు. ఈలోగా బ్రేక్...! విపక్షం వాళ్ళు జరిగిన స్కాం గురించి అడిగితే మీకసలు అడిగే అర్హత లేదన్నారు...ఈ పక్షం వాళ్ళు! మీ నిర్వాకం ముందు మాదెంతని కడిగేశారు..! జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని వీరంటే.. విషయం అంత పెద్దదేమీ కాదని తేల్చేసారు..!! (దీనికన్నా పెద్దది వండి వార్చడానికి రంగం అప్పటికే సిద్ధం అవుతోందేమో!!) ఒకవేళ చెయ్యవలసి వస్తే మీ హయాం లో జరిగినవన్నిటి మీదా దర్యాప్తు చేసినతర్వాత మా వంతంటారు..!! ఏంకర్ తన దగ్గరున్న సాక్ష్యాల లాంటి documents అన్నీ ఏకరువు పెడితే 'అవన్నీ కోర్టు, దర్యాప్తు సంస్థల పరిధి లో వున్నాయి కాబట్టీ' మాట్లాడకూడదంటారు. . రాజ్యాంగ వ్యవస్థని, చట్టాల్ని మరింత పటిష్టం చేయాలంటారు..మళ్ళీ ఇంకో బ్రేక్..!! తర్వాత ప్రేక్షకుల వంతు..ప్రశ్నలడిగారు...సమాధానం మాత్రం లేదు..! మావాడూ అడిగాడు... అందరూ ఘొల్లున నవ్వారు. మొహమాటానికి మావాడూ నవ్వాడు. అన్ని లక్షల కోట్ల వ్యవహారాన్నీ సింపుల్ గా నవ్వులతో ముగించి...గట్టిగా చప్పట్లు కొట్టేసారు...!! అందరికీ చెయ్యిచ్చి... స్వపక్షం, విపక్షం చెట్టా పట్టాలేసుకొని...వారి వారి వాక్పటిమని తలుచుకుంటూ గర్వంగా కారేక్కేసారు..!!! మనం మళ్ళీ మన అలవాటైన ప్రేక్షక పాత్ర లో జీవిస్తూ తరిస్తాం. *****
ఇప్పుడే ఇంకో SMS వచ్చింది :
Most of the 1st Class students get technical seats, become doctors and engineers.

some of the 2nd class, pass MBA become Administrators and controll the 1st class!

some of the 3rd class enter politics, become ministers and control them both..!!

and some of the failures join the under world and control them all....!!!

శుభం!
పూర్తిగా చదవండి...

Sunday, October 31, 2010

శ్రీ వేంకటేశ్వర..!!

పై రచనను గమనిస్తే ఇది ఒక చిత్ర కవిత్వం గా బోధపడుతుంది.
మొత్తం పన్నెండు పాదాలు. ప్రతీ పాదం లోనూ ముప్పై ఆరు అక్షరాలు. పాదం మొదలూ చివరా ఒకే అక్షరం ఉంది.. మొత్తం పన్నెండు పాదాలూ కలిపి నిలువుగా మొదటి అక్షరాలను కలిపి చదివితే ' వేంకటేశ్వర' దర్శనమవుతుంది...! అలాగే చివరి అక్షరాలు కూడా...!! మధ్యలో స్వామి గురించిన ప్రశస్తి. ఆది మధ్యాంతరహితుడైన ఆ స్వామిని ఒక చిన్న కవిత లో ప్రత్యేకించి ఆది అంత్యాలలోదర్శించడం చిత్రం గా లేదూ..!!


ఇది మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు గారి చిత్రమైన రచన. వారు భిలాయినగర్ వాస్తవ్యులు. అక్కడి స్టీల్ ప్లాంట్ లో సీనియర్ అక్కౌంట్స్ మేనేజరు గా పనిచేసి రిటైర్ అయ్యారు. భిలాయి లోనే స్థిరపడ్డారు. వారు తెలుగు గడ్డకి దూరంగా వున్నా తన రచనా వ్యాసంగం కొనసాగించిన సాహితీ వేత్త. తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలలో వారివి ఎన్నో రచనలు సుమారు అన్ని తెలుగు దిన, వార పత్రికల లోనూ అలాగే సప్తగిరి, మిహిర మొదలైన ఆధ్యాత్మిక పత్రికల లోనూ అచ్చయ్యాయి. వారు చాలా వ్యాసాలూ, శీర్షిక లూ, కధలూ కూడా వ్రాసి శ్రీ కాళీపట్నం రామారావు మొదలైన సాహిత్య దిగ్గజాల మెప్పు పొందారు. తన అనుభవం లోకి వచ్చిన చిన్నచిన్న సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని వాటిని రచనలుగా మలచడంలో దిట్ట.


(శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు అక్టోబర్ 22 కి డెబ్భై ఏడో వసంతం లోకి అడుగు పెట్టిన సందర్భంగా... ఆయురారోగ్యాలతో వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ వారిపై శ్రీ వేంకటేశ్వర కృప ఎల్లప్పుడూ ఉండాలనీ ప్రార్ధిస్తూ...- కుటుంబ సభ్యులందరి తరఫునా ...- రాధేశ్యాం )

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)