Monday, March 29, 2021

తిరుపతి యాత్ర - ఊంజలసేవ

నా శ్రీమతి కుసుమకుమారి, శ్రీవారి ఊంజల సేవ (సహస్రదీపాలంకరణ సేవ) లో దాసప్రాజెక్టు లో భాగంగా పురందరదాసు కీర్తనలను 23.03.2021 నాడు ఆలపించింది. కరోనా మొదలవ్వకముందు సరిగ్గా అదేరోజున (మార్చి 23నే కార్యక్రమం ఖరారయ్యింది. కాని మార్చి 22 నుండి దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ ప్రకటించిన కారణంగా రద్దయ్యి మళ్ళీ సరిగ్గా ఏడాది తరువాత అదేరోజున మళ్ళీ పాడడానికి నిర్దేశితమయ్యింది. ఆ మర్నాటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు మొదలవడం చేత ఊంజలసేవని రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో అక్కడ పాడేవారిని సాయంత్రం 4.30 కల్లా అక్కడ సిద్దమవాలని చెబుతారు. సరిగ్గా 5.00 గంటలకు ప్రత్యక్షప్రసారం మొదలవుతుంది. ఆ సమయంలో మాం....ఛి ఎదురెండ. కళ్ళెత్తి మీదకు చూడలేనంత..! ఆ అరగంట కార్యక్రమం పూర్తికాగానే నీడవచ్చేస్తుంది..!

 
 


శ్రీవారి తెప్పోత్సవాలను పురస్కరించుకొని చేసిన అలంకరణ


 


మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సత్రం 




పూర్తిగా చదవండి...

Sunday, March 28, 2021

శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో నాకు నచ్చిన పద్యం

శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)

నటీ నటులు: 
కృష్ణుడు: ఎన్ టి రామారావు, 
నారదుడు: కాంతారావు, 
సత్యభామ: జమున, రుక్మిణి: అంజలీదేవి, అష్టమహిషులు: కృష్ణకుమారి తదితరులు.
రచన: దైత గోపాలం

సీ.
సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు
                 ధనమున్నదే భక్తి ధనము గాక !
సర్వోపగతుడగు చక్రి బంధించెడు
                  బలమున్నదే భక్తి బలము గాక !
సర్వభోక్తను జలజాతాక్షు దనియించు
                  ఫలమున్నదే భక్తి ఫలముగాక !
 సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు
                  విద్యయున్నదె భక్తి విద్య గాక !

ఆ.వె.
సర్వవరదుడైన శాన్వి సన్నిధి జేర్చు
పథము గలదె భక్తి పథముగాక !
కాన యితడు భక్తిగల వారలకె గాని
పరులకగ్గమగునె పడతులార ?

చాలా ప్రసిద్ధమైన ఈ పద్యం పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా పేరుపొందిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి చేతులలో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణతులాభారం చిత్రం లోనిది. ఘంటసాల గారు గానం చేయగా నారద పాత్రధారి శ్రీ కాంతారావు గారి మీద చిత్రీకరించబడింది. శ్రీకృష్ణ తులాభారం చిత్రం లోని అన్నిపద్యాలు, పాటలలో మకుటాయమైన పద్యం, చిత్రం క్లైమాక్స్ లో అప్పటివరకు జరిగిన జగన్నాటకానికి తెరదించుతూ శ్రీకృష్ణతత్వాన్నిద్వారకా వాసులకు, మరీ ముఖ్యంగా సత్యాదేవికి తెలియ చెపుతూ నారదుడి పలికిన పద్యం.

పారిజాతాపహరణం కావ్యం మూలంగా ఉంచుకొని తీసిన సినిమా ఇది.
Image result for శ్రీకృష్ణ తులాభారంకథలోకి వెళ్తే శ్రీ కృష్ణుని దర్శనార్థమై దేవలోకం నుండి వచ్చిన నారదుడు వస్తూ వస్తూ ఒక పారిజాత పుష్పాన్ని తీసుకు వచ్చి రుక్మిణీ దేవి చెంతనున్న కృష్ణుడికి ఇస్తాడు. ఆయన వెంటనే ప్రక్కనే ఉన్న రుక్మిణీ దేవికి ఇస్తాడు.
అది తెలుసుకున్న సత్యాదేవి (ఆ తెలియడం కూడా మరోనాలుగు మాటలు కలిపి చెప్పిన చెలుల ద్వారా) అగ్గిమీద గుగ్గిలమౌతుంది.  తన సర్వస్వమని, కాదు కాదు ఆతడు తనకే సొంతమని, తన యానతి మీరజాలగలేడని భావించిన తన మనోవల్లభుడు, అలా తన సపత్నిని ఆ దేవతా పుష్పంతో అలంకరించి ఆదరించడం ఆమెకు ఈర్ష్యాసూయలకు, మనస్తాపానికీ కారణమై, రోషముతో ప్రజ్వరిల్లి అలుకపాన్పు నెక్కుతుంది.


ఇలా జరుగుతుందని ఊహించి భయపడుతూనే వచ్చిన కృష్ణుడు ఆమెను అనునయించడానికి ప్రయత్నించడం, ఈతని శిరస్సును ఆ లతాంగి వామపాదంబునన్ తొలగన్ త్రోయడం, ఆ తాపుకు తన శరీరం పులకలెత్తిందనీ, ఆ ముళ్ళు గుచ్చుకోవడం చేత నీ లేతపాదాలకు ఎంత బాధ కలిగిందో కదా అంటూ కృష్ణుడు ఆమెను అలుక మానమని బ్రతిమాలడం, ఆమె మరల మెత్తబడిన పిదప శ్రీ కృష్ణుడు నీకు ఉత్తి పువ్వేం ఖర్మ, స్వర్గలోకం నుంచి ఏకంగా చెట్టే తెచ్చేస్తాను పెరట్లో నాటించుకుందువుగాని అని పలికి, ఆపనికి భామను కూడా తీసుకువెళ్ళి ఆ చెట్టు పెకలించుకు రావడం తో ఒక అంకం ముగుస్తుంది.


తన నాథుడు తనకే సొంతమని గర్వాతిశయంతో మిడిసిపడ్డ సత్యాదేవికి ఎందుకో ఏదో మూల చిన్న సంశయం..! తన పతి సొంతమైనట్టే ఉన్నాడు కాని మళ్ళీ చేజారిపోతాడేమోనన్న అభద్రతా భావం. ఇలా ప్రతి సారీ తన సవతులతో పోటీకి దిగి భర్త దరిచేరడం ఏమిటని..!? సరిగ్గా అదే సమయానికి కలహభోజనుడి పునః ప్రవేశంతో కథ రసకందాయంలో పడుతుంది. తన భర్త తనకే స్వంతం కావాలంటే ఏంచేయాలో కాస్త చెప్పమని సత్య నారదులవారిని అడుగుతుంది. పుణ్యకవ్రతమని ఒకటి ఉన్నదని, ఆ వ్రతం చేస్తే భర్త నిజంగానే తన స్వాధీన వల్లభుడౌతాడని చెప్పిన నారదమహర్షికే ఆచార్యకత్వం వహించమని అడుగుతుంది. సరేనని నారదుడు ఆమెచేత ఆ వ్రతం చేయిస్తాడు. అయితే వ్రత సమాప్తి నియమంగా భర్తని ఎవరైనా తపస్సంపన్నుడికి దానమీయాలని, మెలిక పెడతాడు. తరువాత మరల శ్రీకృష్ణుతో తుల తూగే ధనముగాని ధనేతరములను ఎదురిచ్చి స్వామిని మరల స్వంతంచేసుకోవచ్చంటాడు. ఐతే ఎవరికో ఎందుకు ఆ దానం మీరే పుచ్చుకోండి, తన భర్త, కృష్ణుని ఒక్కమారుకాదు పదిసార్లైనా తూచ గలిగే ధనము నీయగల శ్యమంతకమణి తనవద్ద ఉన్నదని బీరాలు పోతుంది.

సరే నని వ్రతమంతా ముగించి తులాభారానికి వచ్చేసరికి అప్పుడు జగన్నాథుని జగన్నాటకం అవగతమౌతుంది. తనవద్ద ఉన్న ఏడువారాలనగలూ, శ్యమంతకమణి ప్రసాదించిన బంగారం, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులూ ఆఖరికి తనూ, తన పరివారము, పురజనుల నిలువు దోపిడీ ఇచ్చి తూచినా త్రాసు ముల్లు కాస్తకూడా కదలదు.

 

అప్పుడు తన తప్పు తెలుసుకొని మార్గాంతరం బోధించమని మహర్షిని కోరితే అప్పుడు చెప్పే పద్యం ఇది:

సీ.
సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు
                 ధనమున్నదే భక్తి ధనము గాక !
సర్వోపగతుడగు చక్రి బంధించెడు
                  బలమున్నదే భక్తి బలము గాక !
సర్వభోక్తను జలజాతాక్షు దనియించు
                  ఫలమున్నదే భక్తి ఫలముగాక !
 సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు
                  విద్యయున్నదె భక్తి విద్య గాక !

ఆ.వె.
సర్వవరదుడైన శాన్వి సన్నిధి జేర్చు
పథము గలదె భక్తి పథముగాక !
కాన యితడు భక్తిగల వారలకె గాని
పరులకగ్గమగునె పడతులార ?





ఇది కూడా చూడండి.!!

బహుభార్యత్వ వ్యవస్థలో సత్యభామ అస్తిత్వ అన్వేషణ

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)