Showing posts with label వినాయకుడు. Show all posts
Showing posts with label వినాయకుడు. Show all posts

Monday, September 9, 2013

మట్టి వినాయక ప్రతిమ

బ్లాగు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 

పోయిన ఆదివారం మా ఇంట్లో నేను, మా పిల్లలూ, వాళ్ళ ఫ్రెండ్స్ కలసి మట్టి వినాయకుడిని చెయ్యడం కోసం ఇలా ఒక వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. మా పిల్లలు కృష్ణప్రియ, కృష్ణ ప్రీతమ్ వాళ్ళ స్నేహితులు భవ్య, భార్గవ్ లతో కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (భవ్య వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు నాకు కాలేజీ లో క్లాస్మేట్) వీళ్ళంతా మా శ్రీమతి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. భవ్య, కృష్ణప్రియ తమ సహాధ్యాయులతో కలసి చిన్న చిన్న ప్రోగ్రాములలో కూడా పాడారు.
 మట్టి గణపతిని తయారు చెయ్యడానికి సూచనలిస్తూ  నేనే..!!
నేను, నా శిష్య బృందం.. మట్టి వినాయకుడి రూపకల్పనలో..!





మా అమ్మాయి కృష్ణప్రియ
మా అబ్బాయి కృష్ణ ప్రీతమ్ , వెనుక ఉన్నది వాడి ఫ్రెండ్ భార్గవ్ 







విఘ్నేశ్వరుడి తయారీలో మొదటి అంకం
భార్గవ్ వాళ్ళ అక్క..! పేరు భవ్య..
















ప్రతి ఫోటో క్రింద ఆ బొమ్మ తయారు చేసిన వారి పేరు చూడండి.
కృష్ణప్రియ
 కృష్ణ ప్రీతమ్ ( దీనికి రంగులేసింది నేను..!)

ప్రీతమ్ , భార్గవ్, భవ్య
తయారు చేసినది భార్గవ్, కుంచె తో రంగులద్దింది  వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు
భవ్య

ఇది నేను గీసినదే..! బ్లాక్ బోర్డ్ పైన సుద్దముక్కతో ..!!
  

ఇదివరకు వినాయకచవితి సందర్భంగా వ్రాసినవి :

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!

కాలుష్య కారక గణపతి ఉత్సవ మండళ్ళు..!!

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు...

 

 

పూర్తిగా చదవండి...

Sunday, October 16, 2011

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!



యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి  బొమ్మలు  మరికొన్ని...!! 
పురాణాలకూ ఇతిహాసాలకూ సంబంధించిన బొమ్మల్లో కూడా మోడరన్ ఆర్ట్ ని చొప్పించ గలిగే శైలి వడ్డాది పాపయ్య గారి శైలి అనితర సాధ్యం. చందమామ కవర్ పేజీలు బొమ్మలు సప్తవర్ణ సమ్మేళనాలతో ఎంత గొప్పగా ఉంటాయో లోపలి బొమ్మలు సింపుల్ రేఖాచిత్రాలుగా రెండు మూడు రంగులకన్నా వాడకుండా అదికూడా ఫ్లాట్ గా అప్లై చేస్తూ అంతే depth ని కలిగి వుంటాయి. ఈ రకం గా గీయడం బహుశా ఆనాటి ప్రింటింగ్ లిమిటేషన్స్ వల్లనేమో తెలీదు. 
అయితే యువ పుస్తకం లో మాత్రం చాలా వరకు అన్నీ ఇదే శైలిని అనుసరించి గీసినవే..






ఈ రెండూ 'పావనం' పేరు తో చేసినవి. శ్యమంతక మణి బొమ్మలో కృష్ణుడి రూపు రేఖలలో  ఏదో తెలియని తేడా వున్నట్టు అనిపిస్తోంది ఎందుకో..!!


 
 

















1982 చందమామలో వచ్చిన ఈ రెండు బొమ్మలూ పైబొమ్మలను కొంత పోలి ఉండడాన్ని గమనించవచ్చు. అయితే గణపతి వివిధ రూపాలను చిత్రించేటప్పుడు పైబొమ్మలో శివ-కేశవులను తలపింప జేస్తే, క్రింది బొమ్మలో వివిధ వర్ణాలలో చిత్రించారు. శ్యమంతక మణి దృశ్యం లో క్రింది బొమ్మలో కంపోజిషన్, భావ ప్రకటన మొదలైన వాటి దృష్ట్యా నాకు క్రింది బొమ్మే నచ్చింది.   

పై బొమ్మలను  అందించిన శ్రీ శ్యాం నారాయణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 

పూర్తిగా చదవండి...

Sunday, September 25, 2011

కాలుష్య కారక గణపతి ఉత్సవ మండళ్ళు..!!

     ఈ పోస్ట్ వ్రాయడం మొదలుపెట్టింది హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న రోజున..!! కానీ టైం కుదరక.. అర్ధంతరంగా ఆపేసాను. కానీ ఈ రోజు విశాఖపట్నం లో నేలకూలిన అతిపెద్ద వినాయక ప్రతిమను చూసి, ఉండలేక మళ్ళీ మొదలుపెట్టాను.
                శ్రీ సంపత్ వినాయక ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఆర్భాటం గా పెట్టిన వినాయకుడు 127 అడుగుల ఎత్తు, 6300  కేజీల అతిపెద్ద లడ్డు నైవేద్యం -  లాంటి విషయాలలో ప్రత్యేకతను సంతరించుకొంది. విగ్రహ ప్రతిష్టాపన జరుగవలసిన వినాయక చవితి రోజున ప్రొద్దున్నే పెద్ద వర్షం కురవడంతో ఆ కార్యక్రమం మర్నాడు జరిగింది. ఏదేమైనా నిమజ్జనం ఇంకొద్ది గంటల్లో జరగనుందనగా మొత్తం విగ్రహం నేల కొరగడం చాలా దురదృష్టకరం. కార్య నిర్వాహక సమితి వాళ్ళు ప్రాయశ్చిత్త విధులూ, గణేశ హోమాలూచేసి నిమజ్జనం విగ్రహం ఉన్నచోటే (?) చేసేసి అయిందనిపించారు.
                   ఈలోగా మన పాత్రికేయ మిత్రులు యధావిధిగా లైవ్ కవరేజ్ చేస్తూ, ఈ దుర్ఘటన వాళ్ళ ఏమైనా అనర్ధాలుంటాయా..! అపచారమేదైనా జరిగిందంటారా..?? అంటూ లీడ్ విశ్లేషణలూ.., దానికి ఒకరు.. "అబ్బే.. ఇక్కడ పూజలేవీ పధ్ధతి ప్రకారం జరగనే లేదండీ" అంటూ సన్నాయి నొక్కులు..!!
                 అదృష్టవశాత్తూ నిర్వాహకులు ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, భక్తులకు దర్శనాలు నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కూలిన సమయం లో దగ్గరలో ఎవ్వరూ లేరు. ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ మధ్యే ఎవరో రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని ఇలాగే తాత్కాలికంగా వేసిన పందిరి లోపెట్టబోతే అది నిర్మాణం కూడా పూర్తికాకుండానే నేలకూలింది. ఇంతకుముందు ఇలాంటి భారీ వినాయకుడి పెండాల్ లోనే షార్ట్ సర్క్యుట్ కారణం గా విగ్రహం పూర్తిగా తగలబడిపోయింది. కనీసం మంటలార్పే సాధనాలుకూడా నిర్వాహకుల వద్ద లేవు. అన్ని సందర్భాలలోనూ ఏదో ఘనత సాధించాలనీ, రికార్డుల కెక్కాలనే సరదా నే తప్ప.. ప్రమాదం జరిగే అవకాశం వుందనికానీ, ఒకవేళ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గానీ నిర్వాహకులకి కొరవడుతోంది. అసలు అంతపెద్ద విగ్రహాలను పెట్టడం లో గల ఆంతర్యం ఏమిటో ఆ విగ్రహాలు పెట్టిన నిర్వాహకులకే తెలియాలి.
              ఈసారి ప్రజల చైతన్యం పుణ్యమా అని దాదాపు అందరూ మట్టి విగ్రహాలకే మొగ్గుచూపారు. అందరితో పాటే ఈ పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా 'ఎకో ఫ్రెండ్లీ' వినాయకుడని చెప్పుకుంటూ మట్టి తోనే విగ్రహాలు తయారు చేసారు. అంతవరకూ బాగానే వుంది. కానీ నిమజ్జనం దగ్గరికొచ్చేసరికీ సమస్యలు మొదలు. అంత భారీ విగ్రహాన్ని వున్నచోట నుంచీ కదిల్చే పరిస్థితి  లేదు. దాంతో ఉన్నచోటే నిమజ్జనం చెయ్యడం మొదలుపెట్టారు. అన్ని రోజులు పూజలందుకొన్న వినాయకుడు.. మన కళ్ళ ముందే  తన సుందర రూపాన్ని కోల్పోతూ వుంటే చూడడానికి నాకైతే మనస్కరించదు. పైగా ఈ నిమజ్జన కార్యక్రమం లో కార్పోరేషన్ నుంచి తెచ్చే మంచినీరు (శుద్ధి చెయ్యబడిన, ప్రజలకు అందాల్సిన త్రాగునీరు) టాంకుల కొద్దీ తెచ్చి విగ్రహం మీదకి పిచికారీ చేస్తూ విగ్రహాన్ని కరగ బెడతారు. ఎంతనీరు వాడారో అంతా వృధాగా పోవలసిందే. విగ్రహం సైజు పెరిగే కొద్దీ ఈ మంచినీటి వృధా ఇంకా పెరుగుతూ వుంటుంది. 
(ఈ మధ్యే పేపర్లో చూసాను..! నగరం లో సామాన్య ప్రజలకు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో నెలకొల్పబడిన రక్షిత మంచినీటి కొళాయిలను ప్రభుత్వం అంచెలవారీగా తీసివేస్తుందట..!!) నీటిని ఇంతలా వృధా చేస్తూ ఆ వినాయకుడిని ఎకో ఫ్రెండ్లీ అని ఎలా భావించాలో అర్ధం కాదు.
 నిమజ్జనం యొక్క అసలు స్ఫూర్తి ఇది. ఈ బాలలు చేస్తూన్న వినాయకుడు నిజమైన పర్యావరణ మిత్రుడు.
 ఈ రకమైన కృత్రిమ నీళ్ళ టాంకు లను అందుబాటులోకి తెస్తే మంచి నీటి వృధాని చాలా వరకు తగ్గించ వచ్చు.
 *********
గణేశ  నిమజ్జనాల  తరువాత కనిపించే ఈ దృశ్యాలు ఎవ్వరినైనా కలవరపెట్టక మానవు.









  • ప్రభుత్వం ఈ విగ్రహాల సంఖ్య మీద ఖచ్చితంగా నియంత్రణ విధించాలి. ప్రతీ సంవత్సరమూ నిర్వాహకులు క్రొత్తగా పుట్టుకొస్తున్నారు. అలాగే విగ్రహాల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతోంది. ఫలితంగా కాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోంది.
  • ఊరేగించలేని లేదా హాండిల్ చెయ్యలేని సైజు లో విగ్రహాలు పెట్టడానికి అనుమతించకూడదు. 
  • చెవులు చిల్లులు పడేలా పెట్టే సౌండ్ సిస్టం మరియు అర్ధ నగ్న నృత్యాలు, మరియు చెత్త పాటలకి స్వస్తి పలకాలి.
  • నిర్వాహకులు వారి రికార్డుల కోసం, తద్వారా అక్కడకు వచ్చే భక్తులనుంచి డబ్బులు రాబట్టడం, లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో వుండే విగ్రహాలని ప్రజలే బాయ్ కాట్ చేస్తే మరీ మంచిది.
  • పర్యావరణ, కాలుష్య నియంత్రణ, అగ్ని మాపక శాఖ, పోలీసు, మరియు నగరపాలక సంస్థల నుంచి అనుమతులు తప్పనిసరి చేయాలి. ( MVP కాలనీ లో కూలిన విగ్రహానికి ఈ అనుమతులు లేవంటూ మర్నాడు పేపర్లో వచ్చింది. అవి లేకుండా ఇరవై రోజుల పాటూ దర్శనానికి ఎలా అనుమతించారో తెలీదు. నగర ప్రముఖులంతా దర్శనాలు చేసుకున్నారు. అలాంటి VIP లు వుండగా ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో..!!??) 
  • కొంత మంది సిక్స్ ప్యాక్ వినాయకుడు, అపరిచితుడు, అవతార్ లాంటి సినిమా గెటప్ లతో కూడా విగ్రహాలు పెడుతున్నారు. వాటివల్ల ఏ రకమైన భక్తిభావం కలుగుతుందో వారికే తెలియాలి.
  • రంగులు కూడా ప్రమాదకరమైన రసాయనాలతో తయారవడం వల్ల చెరువుల్లో వుండే చేపలూ మొదలైన జీవ జాతులకు కూడా అపాయం కలుగుతోంది. అందువల్ల వాటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. 
 
కనీసం రాబోయే దుర్గా పూజలకైనా లేనిపోని భేషజాలకు పోకుండా విగ్రహాలు కాలుష్య రహితంగా విగ్రహాలను ఏర్పాటు చేసే సద్బుద్ధినీ శక్తినీ ఈయమని కోరుకుందాం.

పూర్తిగా చదవండి...

Wednesday, August 31, 2011

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!


హైదరాబాదులో వినాయక చవితి ఎంత కోలాహలం గా చేస్తారో మనకి తెలియంది కాదు. చూడముచ్చటైన గణేశ ప్రతిమలు  రోడ్డుప్రక్కన ఉన్నచిన్నచిన్నగుడిశలలోని కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడి నుంచి విగ్రహాలు ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి అవుతాయి. రేపు జరగబోయే గణపతి నవరాత్రి మహోత్సవాలకి కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్న అలాంటి విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకొంటున్న తరుణంలో తీసిన ఫోటోలు ఇవి. (విశాఖపట్నం నుంచి తెలిసిన వాళ్ళు కొందరు హైదరాబాద్ వెళ్లి ఒక పదిహేడడుగుల భారీ  విగ్రహం తెచ్చుకున్నారు. విగ్రహాల కోసం తిరుగుతూ నచ్చిన విగ్రహాల ఫోటోలు తీసారు. ఆ ఫోటోలు క్రింద చూడండి.




 


 






విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీలో తుది మెరుగులు: 
ఇక్కడి దాకా పోతపోసే అచ్చులుంటాయి కాబట్టీ ఒక రకం గా పని సులువే. కానీ ఇకపై ఉండేదంతా చేతితోనే చెయ్యాలి. అన్ని విగ్రహాల మీదా ఒకేరకమైన శ్రద్ధ చూపాలి. ఆహార్యం, అలంకరణ, ఆభూషణాలూ అన్నీ ముఖ్యమైనవే..!కళాకారుడి పనితనం తెలిసేది ఈ చివరి అంకంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ.






మరింత పెద్ద విగ్రహాలు - ఎత్తు ముప్పై అడుగుల పైమాటే..!!
 కానీ ఈవిగ్రహాలలో చాలా వరకు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచెయ్యబడినవేనట. ఈసారి ప్రజలలో కూడా మట్టి విగ్రహాల వాడకంలో మంచి చైతన్యం వచ్చింది. అక్కడక్కడ ఇంకా కొందరు మాత్రం పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నూ, రసాయన పదార్ధాలు కలిసిన రంగులనూ వాడుతున్నారు. అయితే విశాఖపట్నం లో తయారవుతున్న రెండు అతి భారీ విగ్రహాలు మాత్రం పర్యావరణానికి అస్సలు హానిచేయని రీతిలో పూర్తిగా మట్టితోనే తయారయి "మట్టితో భారీ విగ్రహాలను తయారు చెయ్యడం సాధ్యమేనా..?" లాంటి అనుమానాలను పటాపంచలు చేసాయి. రెండిటి లో ఒకటి 117 అడుగులు (గాజువాక) కాగా రెండోది (ఎం.వీ.పీ. కోలనీ) 95 అడుగుల పొడవు.
క్రింద వీడియో చూడండి.


 మట్టి విగ్రహాలు దొరికే స్థలాలూ, మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింద చూపించిన లింకుల పై నొక్కండి.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)