Showing posts with label పద్యం. Show all posts
Showing posts with label పద్యం. Show all posts

Monday, January 13, 2020

పోతన కవితా చమత్కృతి - రవిబింబంబుపమింప పద్యం:

బమ్మెర పోతన ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో, వామనుడు త్రివిక్రమావతారుడై పెరిగిపోయే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించిన పద్యం ఇది.

మత్తేభము.
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై/
శ్రవణాలంకృతియై, గళాభరణమై సౌవర్ణ కేయూరమై/
ఛవి మత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర/
ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్!

ఒక గీతను చెరపకుండా చిన్న గీత చెయ్యాలి అంటే ఏంచెయ్యాలో మనకందరకూ తెలిసిన సంగతే! దాని ప్రక్కనే మరో పెద్ద గీత గీస్తే సరి..! ఒక వస్తువు పెద్దదా చిన్నదా అని తెలియాలి అంటే దానితో పోల్చి చెప్పడానికి ప్రక్కన ఇంకో వస్తువు ఉండాలి. అలా చెప్తే మనం పోల్చిన ఆ వస్తువుయొక్క గుణము ఎంత పెద్దదో లేదా చిన్నదో తెలుస్తుంది. మనం విమానం లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఆకాశంలో చుట్టుపక్కల మేఘాలో మరింకొకటో ఏమీ లేకపోతే మనం కదులుతున్నట్టే అనిపించదు. నిజానికి మనం చాలా వేగంతో వెళ్తూ ఉంటాం.  అదే విమానం లో మనం నేలపైకి దిగినప్పుడు వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న పరిసరాల్ని చూస్తే విమానం ఎంతవేగంతో వెళ్తోందో మనకి అనుభవం లోకి వస్తుంది. 
పై చిత్రాలు రెండూ కీ. శే. బాపు గారివి. వారికి నా కృతజ్ఞతాంజలి.
ఎత్తు- పల్లం, పొడుగు- పొట్టి,  పెద్ద - చిన్న ఇలాంటి వాటికి ఏదో ఒకటి పోల్చడానికి ఉండాలి. ఎందుకంటే అవన్నీ సాపేక్షం కాబట్టి..!  
ఇప్పుడు మనం మన పద్యంలోకి వచ్చేద్దాం..! ఇక్కడ వామనుడు త్రివిక్రముడై భూనభోంతరాలు దాటి పెరుగుతున్నాడు. విశ్వమంతా వ్యాపిస్తున్న అతనిని కొలవాలి, లేదా ఎంతగా వ్యాపిస్తున్నాడో చెప్పాలి అంటే మనకు బాగా తెలిసిన, రోజూచూసే దానితో పోల్చి సాపేక్షంగా చెప్తే బాగా తెలుస్తుంది.       
పోతన ఆ పొలికకు రవి బింబాన్ని ఎన్నుకున్నారు. ఎదుగుతూ ఉన్న వామనుడు ఎంతగా పెరిగాడంటే,
మొదట అతనికి ఛత్రము (గొడుగు) వలె శోభించిన రవి బింబము, తరువాత శిరోరత్నము వలె, చెవి ప్రోగు వలె, కంఠాభరణము వలె, బంగారు దండకడియము వలె, కంకణము వలె, మొలత్రాడులో గంట వలె, కాలి అందె వలె చివరకు పాదం క్రింద పీట వలె భాసించిందట..! గమనించవలసిందేమంటే ఇక్కడ ఈ పొలికలన్నీ పురుషులు తమ శరీరంలో తలనుంచి పాదం దాకా ధరించే వివిధము లైన ఆభరణాలను సూచిస్తున్నాయి. 
ఇక్కడ సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. సూర్యుడు గొడుగు గాను, పాద పీఠం గానూ ‘మారలేదు’. అలా కనిపించాడు అంతే..! ఉపమానానికి అంటే పోల్చడానికి పాత్రమయాడు అని పోతన్న గారే చెప్పారు. అంటే వామనుడు పెరుగుతూ సూర్యుణ్ణి కూడా ఎంతలా దాటి పోయాడంటే గొడుగు వలె కనిపించిన సూర్యుడు అంతలోనే పదపీఠం వలె కనిపించాడట..!                        
ఈ పోలిక ద్వారా వామనుడు త్రివిక్రముడైన రూపం మనకు ఊహించుకోవడానికి ఒక కొలమానం (స్కేల్) ఇచ్చారు పోతన గారు. ఇప్పుడు ఆ ఊహతో ఆ కొలమానాన్నిబట్టి పద్యాన్ని మళ్ళీ చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో..!
సూర్యుడే మనకి చాలా దూరంలో ఉంటాడు, అలాంటిది మరి ఆ సూర్య బింబం త్రివిక్రముడైన వామన మూర్తికి పాద పీఠం గా అమరింది అంటే ఆ స్వామి ఎంతగా పెరిగాడో తెలుస్తుంది..! (తెలుస్తుందా..!?) 

 

ఈ పద్యాన్ని స్వరపరచిన ప్రముఖ సంగీత కళాకారిణి సంగీత సుధానిధి శ్రీమతి మండ సుధారాణిగారు తమ స్వర రచనలో చూపిన చమత్కృతి గమనించండి. ఎంతో ఎత్తున ఉన్న సూర్యుడు అలా అలా క్రిందికి దిగుతున్నట్ట్లు కనిపిస్తున్నాడని కదా పోతన గారి వర్ణన..!? అదే కవి హృదయాన్ని అనుసరిస్తూ పద్యాన్ని తారస్థాయిలో మొదలుపెట్టి మారుతున్న సూర్యుడి స్థానానికికి తగ్గట్టుగా ఒక్కక్క స్థాయికి స్వర సంచారాన్ని అవరోహణ చేయిస్తూ వచ్చి పదపీఠమై అన్న దగ్గర మంద్రస్థాయి షడ్జంలో నిలిపారు.

కాని ఆ సమయంలో వటువు త్రిభువనాలు దాటి ఎదుగుతున్నాడే, మరి ఆ స్వామిని దర్షించాలంటే ఎంత తొందరగా మనం ఆ ఎత్తుకి వెళ్ళాలి? అందుకే శ్రోతలకు ఆ గమనాన్ని సూచించేటట్లుగా ’వటువు తా బ్రహ్మాండమున్ నిండుచోన్’ అంటున్నప్పుడు స్వరాలను మంద్ర స్థాయినుంచి మధ్యమ తారస్థాయి లను దాటించి అతి తారస్థాయికి వేగవంతమైన సంచారం చేయించి త్రిభువనాలను దాటి వెళ్ళాడన్న కవి భావాన్ని తమ స్వరకల్పనలో ఆవిష్కరించి, స్వామి వారి హృదయస్థానమైన తారస్థాయిలో పద్యాన్ని నిలిపారు. పై వీడియో లో పద్యాన్ని ఆలపించింది శ్రీమతి సుధారాణిగారివద్ద వద్ద శిష్యరికం చేస్తున్న మా అమ్మాయి చి. కృష్ణప్రియ.
సర్వవ్యాపి ఐన విష్ణువు మనందరకూ శుభము కలుగజేయు గాక..!
పూర్తిగా చదవండి...

Sunday, July 10, 2016

పద్యంతో తలచుకున్న అక్షరాన్ని కనిపెట్టడం

జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఈ పద్యం కళ్ళబడింది. శ్రీ దీపాల పిచ్చయ్య  శాస్త్రి గారు వ్రాసినదట
1. అరిభయంకర చక్రకరి రక్షసాగర
చాయ శ్రీ కర్బుర సాటియుగళ

2. నాళీక సన్నిభ నయన యండజ వాహ
వాణీశ జనక వైభవ బిడౌజ!

4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష
వరజటి స్తుత శౌరి వాసుదేవ!

8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమ గరుడ

16. దోష శైలేశ శశిద్రక్ష** ద్రుహిణ హేళి
(’శశిద్రక్ష’ కు సవరణ క్రింది వ్యాఖ్యలో పొందుపరచడమైనది. గమనించగలరు)


ఇప్పుడు తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో ఏదైనా ఒకటి మనసులో తలుచుకోండి.. తర్వాత పైన పద్యంలో ఆ అక్షరం ఏయే పాదాలలో ఉందో చెప్పండి చాలు.. మీరు అనుకున్న అక్షరం నేను చెప్తాను..
తలుచుకోవడంలో కొన్ని నియమాలు పాటించాలి.
అచ్చుల్లో 'అ' మాత్రమే తలుచుకోవాలి. హల్లుల్లో ఙ్, ఞ్, మాత్రం వదిలేయాలి. 
న - ణ, ల - ళ, ర - ఱ లకు తేడా ఉండదు. 
ఒక అక్షరం గుణింతాలు అన్ని ఒకటే అక్షరం కిందే భావించాలి.
ఈ ప్రహేళికకు పరిష్కార వాక్యం ఇది.. 

అన్నయ్య తోటి విస్సాప్రగడ కామరాజు భాషించు హేళి దాక్షిణ్యశాలి

అ - 1
న్న - 2
య్య - 3
తో - 4
టి - 5
వి - 6
స్సా - 7
ప్ర - 8
గ - 9
డ - 10
కా - 11
మ - 12
రా - 13
జు - 14
భా - 15
షిం - 16
చు - 17
హే - 18
ళి – 19
దా – 20
క్షి - 21
ణ్య- 22
శా - 23
లి - 24


ఎదుట వ్యక్తి తలుచుకున్న అక్షరం ఉన్న పాదాల నంబర్లను కూడగా వచ్చిన నంబరును ఈ వాక్యంలో చూసుకుని దానిపక్కన ఉన్న అక్షరం చెప్పండి అంతే...ఉదా... ఎదుట వ్యక్తి 'ర' అనుకున్నాడనుకోండి. అది 1, 4, 8, పాదాలలో ఉంది. ఆ నంబర్లను కూడితే 13 వస్తుంది. పైన పైన పరిష్కార వాక్యంలో 13 పక్కన ఉన్న అక్షరం ర... ఈజీగా ఉంది కదా..!
ఇంతవరకు జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఉన్నదే..! అయితే వారిచ్చిన పద్యంలో నేను గమనించింది ఇది:

16 నెం. కు ఎదురుగా ఉన్న పాదం లో రెండు వాక్యాలు ఉండాలేమో అనుకుంటున్నాను. ఉదా. కి చ తలుచుకున్నా మనుకోండి. పరిష్కార వాక్యం ప్రకారం 17వ అక్షరం ’చ’. కానీ మీరిచ్చిన సీస పద్యం లో ’చ’ కేవలం ఒకటవ పాదం లో మాత్రమే ఉంది. అదే 16వ పాదం లో ఇంకో వాక్యం ఉండి, దానిలో’చ’ కలిగి ఉంటే 1+16 =17 లెక్క సరిపోయేది.
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పద్యం పూర్తిగా ఎవరి వద్దనైనా ఉంటే క్రింది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు.
పూర్తిగా చదవండి...

Friday, May 3, 2013

మతిపోయే కాంబినేషన్..!

  
ఎన్టియారు, జగను, చిన్నెంటియారునూ,
ప్రక్కప్రక్క నుండె వింతగొలుప
ఆవరుస ముందుండె రాజశేఖర్రెడ్డి
విజయమ్మ, షర్మిలయె వెంట నుండ
చేరె ప్రభాసూ, మహేషు బాబుల జంట
ఇంకెంద రొచ్చెదరొ వేచిచూడ

అసాధ్యమౌనట్టి ఈ కాంబినేషన్ ను
సుసాధ్యమొనరించె అభిమానులే! మరి
ఏ ముఖముదే పార్టి, ఏపార్టి దే ముఖమొ 
తెలియరాలేక ప్రజ తెల్లబోయె..!


పూర్తిగా చదవండి...

Saturday, April 6, 2013

మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ..!

పద్యాల నడక మీద శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వివరణాత్మకమైన వ్యాసం (ఛందస్సు తో నడక - 3) చూసాక చాలా బోల్డు ఇన్స్పిరేషన్ వచ్చేసి నేనూ ప్రయత్నించాను. ముఖ్యంగా ఆయన చెప్పిన'తాన తానన  తాన తానన  తా తానన  తాననా' నడక వినగానే మొదట స్ఫురించినది :
అల్లు రామలింగయ్య మీద చిత్రీకరింపబడిన పాట:  'అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమె భామినీ' 
నేను వ్రాసినది పంపితే వారు దోషాలు ఎత్తి చూపి సరిదిద్దుకోవడానికి సహకరించారు.
******************************
  1. కామేశ్వర రావు గారికి,
    మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది.
    నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:

    నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
    గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
    పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా
    దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా


  2. మత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ
    చిత్తమందున తలపుకొచ్చుట చిత్రమూ బహు చిత్రమూ
    వృత్తవివరణ చాలబాగుగ విశదపరచిన భైరవా..
    కొత్త నాకిది తప్పులున్నచొ కాయుమో కామేశ్వరా..!


  3. ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము
    గ్రాసమిప్పుడు నాదు మెదడుకు గట్టిగా నే పూనగా
    దోస వేసిన చందమున పద్దెములనే నే కూర్చగా
    దోసమున్నచొ పెద్దమనసుతొ దిద్దిపెట్టు కవీశ్వరా..!


  4. రాధేశ్యామ్ గారూ,
    చాలా సంతోషమండి. మత్తకోకిల నడకని చక్కగా పట్టుకున్నారు!
    అయితే మీ పద్యాలు కచ్చితమైన మత్తకోకిల వృత్తంలో ఉన్నవని చెప్పలేము, సరిగ్గా అలాగే ఉండే మాత్రాఛందస్సులో ఉన్నాయి. ఈ తేడా తెలియాలంటే తర్వాతి టపా "ఛందస్సుతో నడక - 4" చదవండి. :-)
    కామేశ్వర రావు గారూ, మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.
    "ఛందస్సుతో నడక - 4" చదివాను. మత్తకోకిల నన్ను గట్టిగానే ఆవహించింది. నా పద్యాలు కొద్దిగా సరిచేసాను(అని అనుకొంటున్నాను). చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

    నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
    గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
    పండు వెన్నెల సాటిరాగల పాప నిద్దుర పుచ్చగా
    దిండు సర్దుచు జోలపాడెడు దల్లియేగద కోయిలా!

    మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ
    చిత్తమందు తలంపుకొచ్చుటె చిత్రమూ బహు చిత్రమూ
    వృత్తలక్షణ మర్మమెల్లను వ్యక్తపర్చిన యొజ్జవే ..
    కొత్త నాకిది తప్పులున్నచొ కోపగింపక గావవే!

    ప్రాసయతులన నాకు దెల్వదు పట్టులేనిది సత్యమూ
    గ్రాసమిప్పుడు నాదు మేథకు పట్టువచ్చుట తథ్యమూ
    దోశ క్రొత్తగ వేయురీతిగ తెల్గు పద్దెము కూర్చగా
    దోసమున్నచొ, నీకు మ్రొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..!


    శ్రీ గురుభ్యోనమః
    ప్రణామాలతో
    రాధేశ్యామ్
    మళ్ళీ తప్పింది..ఈసారి ఇది చూడండి గురువుగారూ..!
    ప్రాసయన్నది నాకుదెల్వదు పట్టులేనిది సత్యమూ
    గ్రాసమిప్పుడు నాదుమేథకు పట్టువచ్చుట తథ్యమూ 
    దోశ కొత్తగ వేయురీతిగ దెల్గుపద్దెము కూర్చగా
    దోసమున్నచొ, నీకు మొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..! 
    రాధేశ్యామ్ గారూ,
    బాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల గణాలన్నీ సరిపోయాయి. దోశలు తిప్పడం బాగా వచ్చినట్ట! :-) మొదటి పద్యంలో భావం కూడా చాలా బాగుంది. అన్ని పద్యాలలోనూ ప్రాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల యతులు మాత్రం సరిపోలేదు. యతిలో అచ్చు మైత్రి, హల్లు మైత్రి అని రెండుంటాయి. ఇంచుమించు అన్నిచోట్లా హల్లు మైత్రి కుదిరింది కాని అచ్చు మైత్రి కుదరలేదు. యతి గురించి వివరణ యిక్కడ చూడండి:
     
    వామ్మో..! ఇన్నున్నాయంటే చిక్కుపడకపోదునే..!!
    అయిననూ ప్రయత్నించెదను..!! :)
    మీ సలహాలకు ధన్యవాదాలండీ..చాలా నేర్చుకోగలుగుతున్నాను. 
     
    వృత్త లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, పద్యాలు చదువుకోడానికి చక్కగా ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చనవసరం లేదు. కొత్తగా వ్రాసేటప్పుడు యతి గురించి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో నడక చక్కగా కుదిరి, మంచి భావాలతో వ్రాయగలిస్తే అవి మంచి పద్యాలే, యతి సరిపోకపోయినా.. 
    మరి మార్చక్కర్లేదన్నారు, ఇహ ఇబ్బంది పెట్టను..!
    ధన్యవాదాలు గురువుగారూ..! నేనప్పుడే మీరిచ్చిన లింకుతో డా. ఫణీంద్ర గారి బ్లాగరమథనానికి పూనుకొనేశా..!!
     - రాధేశ్యామ్
     ******************************
    తెలుగు పద్యం బ్లాగు నడుపుతున్న శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారికి, వారి బ్లాగులో 'సులువుగా పద్యం వ్రాయండి ... ' శీర్షిక నడుపుతున్న డా. ఆచార్య ఫణీంద్ర గారికి, పద్యమంజూష బ్లాగు నడుపుతున్నటేకుమళ్ళ వేంకటప్పయ్య గారికీ నా నమస్సులు..! పద్య రచనా  నియమాలను, తత్సంబంధమైన ఎన్నో ఆసక్తికరమైన  విశేషాలను  ఔత్సాహికులకు సులభ గ్రాహ్యంగా అందిస్తున్న వీరూ, వీరివంటి మరెందరో మహానుభావులకు వందనాలర్పిస్తున్నాను.   
     
పూర్తిగా చదవండి...

Sunday, January 27, 2013

'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం (పీడీఎఫ్ రూపంలో)

దీని ముందు వ్రాసిన  'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం  పోస్టు  చదివి, ఇది చదువగలరు.
ఆ పోస్టులో పరిచయం చేసుకున్న పుస్తకం ఈ పోస్టులో డౌన్లోడ్ చేసుకోండి.
ఒరిజినల్ పీడీఎఫ్ రూపం లో ఇక్కడ. మెరుగుపరచిన ప్రతి  ఇక్కడ  (శ్యామ్ నారాయణ్ గారి సౌజన్యం)  
ఫోటోల రూపం లో ఈ క్రింద:











 








మీకందరికీ ఈ పుస్తకం నచ్చుతుందని ఆశిస్తూ...
సెలవు. 
పూర్తిగా చదవండి...

'మిత్రనీతి' శతకము - 1934 లో వచ్చిన పుస్తకం

                మన తెలుగు సాహిత్యంలో శతకాలకి ఉన్నస్థానం మిత్రులకు తెలియంది కాదు. ఏదైనా ఒక మకుటము తో అంతమవుతూ వంద పద్యాలకు పైబడిన సాహిత్య విశేషాన్ని శతకమంటారు. సాధారణంగా శతకాలు వాటి మకుటాల తోనే పిలవబడి ప్రాచుర్యం పొందుతాయి. మనకు బాగా తెలిసిన శతకాలలో కృష్ణ శతకము, దాశరధీ శతకము మొదలైనవి భక్తితత్వాన్ని ప్రబోధిస్తే, సుమతీ, కుమారి, వేమన శతకములు మొదలైనవి చాలా సరళమైన భాషతో నీతిని ప్రబోధించే సామాజిక బాధ్యతను తలకెత్తుకొని, పండిత పామర జన రంజకంగా ఉండి జనుల నాలుకలపై తరతరాల పాటు నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న పద్య శతకం కూడా ఈ రెండో కోవకే చెందుతుంది...!   
            మిత్రనీతి అనే ఈ చిన్ని పుస్తకం మన తెలుగు భాషలో మరుగున పడిపోయిన మరొక మంచి పద్యశతకము. "మిత్ర..!" అనే మకుటంతో ఈ శతకాన్ని వ్రాసినది శ్రీ  కొసరాజు రాఘవయ్య చౌదరి గారు (అప్పికట్ల, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా). కాక్స్టన్ ప్రెస్, మద్రాసువారు 1934 లో ముద్రించబడిన ఈ పుస్తకానికి శ్రీ మునిమాణిక్యం నరసింహారావు(BA, Lit., మచిలీపట్నం) గారు పరిచయ వాక్యాలు వ్రాశారు. ప్రతీ పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. నీతి వాక్యాలూ, సామెతలూ పెనవేసి పద్యాలను వ్రాశారు  శతక కర్త. బాల బాలికలకే కాకుండా పెద్దవారికి కూడా ప్రబోధాత్మకంగా ఉండే ఈ పుస్తకం ఇన్నిరోజులు తన వద్ద భద్రం గా దాచుకొని మన ముందుకు తెచ్చిన మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణారావు గారు (ఆర్ ఆర్ కే రావు) ఈ పుస్తకాన్ని తనకు వచ్చిన అపూర్వ కానుక అంటారు. ఎందుకో వారి మాటల్లోనే :

 ************

                దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్రొత్త రోజులు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ఒక ఉద్యమం లాగా నిష్ఠతో నిర్విరామంగా బాల బాలికలకూ, సంఘానికీ సేవ చేసేది. ప్రతీవారూ పాపభీతితో దైవభక్తితో  దేశభక్తి తో  న్యాయం, ధర్మం ఆలోచించి కష్టించి పనిచేసి వారివారి వృత్తులలో శాఖలలో ఎనలేని ఖ్యాతి గడించి,వారి ఆచరణ వాళ్ళ పైవారికి ప్రేరణగా వుండేవారు. ఈ రోజుల్లోలా లంచాలూ స్కాములు అంటే ఏమిటో తెలియని సత్యకాలపు మనుషులు. 

                విజయనగరంలో మావీధిలో ఒక స్కౌట్ ట్రూప్ ఉండేది. మేము కూడా స్కౌట్ గ్రూప్ కి వెళ్లి, ఫస్ట్ ఎయిడ్, సోషల్ సర్వీసు వంటి కార్యక్రమాలలో స్కూల్ సెలవురోజుల్లో ఉత్సాహం గా పని చేసేవాళ్ళం. మా వీధి స్కౌట్ టీచర్స్ ప్రతీ నేలా ఒక ప్రముఖ వ్యక్తిని పిలిచి, ఆయన చేత బాలబాలికలకు స్ఫూర్తిదాయకంగా ఏదైనా అంశం మీద ఉపన్యాసం ఇప్పించేవారు. తద్వారా చిన్ననాడే లబ్ధ ప్రతిష్టులైన ప్రముఖుల భావాలు కొంతవరకు ఆకళింపు చేసుకొనే అవకాశం కలిగేది.

                నెలవారీ కార్యక్రమాలలో భాగంగా ఇతర స్కౌట్ ట్రూప్స్ తో కలిపి పిల్లల మధ్య వకృత్వం, వ్యాసరచన లాంటి పోటీలు నిర్వహించేవారు. న్యాయ నిర్ణేతలుగా అప్పటి ప్రముఖులూ, విద్యావేత్తలూ  వచ్చేవారు. వారిలో  మేజిస్ట్రేట్, కాలేజీ ప్రిన్సిపాల్  మొదలైన వారు ఉండేవారు. డిబేట్  పోటీలో పిల్లల భావాలూ, భాష, నిర్భయంగా మనసులో మాట  స్పష్టంగా చెప్పడం మొదలైన అంశాల ఆధారంగా మూల్యాంకనం చేసి బహుమతులు ప్రకటించేవారు. 

                ఇలా ఒకసారి నేను IV ఫారం చదువుతున్న రోజుల్లో (అంటే సుమారు అరవై ఏళ్ళ క్రితం సంగతి), నేను కూడా వకృత్వ పోటీలో పాలుపంచుకున్నాను. పోటీదారు లందరిలోనూ నేనే చిన్నవాడిని. ఆ రోజుల్లో వయో వర్గీకరణ కూడా ఉండేది కాదు. మాకు ఇచ్చిన విషయం మీద నాకు తెలిసినంతలో నిర్భయంగా, తడుముకోకుండా, సూటిగా చెప్పాను. అందరిలో మాట్లాడాలంటే  నాకు జంకు లేకపోగా  ఉత్సాహంగా చెప్పాను. ప్రేక్షకులు చాలా మెచ్చుకున్నారు.

                ఆఖర్న జడ్జి గారు తమ వెలువరిస్తూ  ప్రకటిస్తూ నాకు మూడో బహుమతి ప్రకటించారు. ఆపోతీలో నాకు వచ్చిన బహుమతి బొబ్బిలి యుద్ధం నాటకం. వెంటనే ఒక కాలేజీ విద్యార్ధి లేచి ప్రథమ బహుమతి వచ్చిన వ్యక్తికన్నాఈ కుర్రవాడే బాగా చెప్పాడనీ, వయసులో చిన్నవాడైనా ఎంతో పరిణతి కనబరచాడనీ, ప్రథమ బహుమతికి అన్ని విధాలా అర్హుడనీ, ఇతనికి ప్రథమ బహుమతి  ఇవ్వడం సబబు గా ఉంటుందనీ నిర్ణయం మార్చమనీ ప్రతిపాదించాడు...! నిర్వాహకులు బహుమతి ప్రదానం జరిగిపోయినందువల్ల నిర్ణయం మార్చడం కుదరదనే సరికి, అదే క్షణంలో ఆ కాలేజీ విద్యార్ధి తన చేతిలో ఉన్న 'మిత్ర నీతి ' అనే నీతి శతక పుస్తకాన్ని నాకు బహుమతిగా తన తరఫున ఇచ్చాడు. ఆపుస్తకం మీద ఉన్న తన పేరు కొట్టివేసి, "   Book presented to R. Rama Krishna Rao of Kothapeta - VZM" అని వ్రాసి అదే వేదికమీద అందరి సమక్షం లో ఇచ్చాడు. 

                అప్పుడు న్యాయ నిర్ణేత లేచి ప్రసంగిస్తూ  తను మూడవ బహుమతి ప్రకటించిన కుర్రవాడు మొదటి బహుమతికి అర్హుడని సభికులు, శ్రోతలూ భావించి తన నిర్ణయాన్ని మార్చమని ప్రతిపాదించడం తనకు ఆనందం కలిగించిందనీ, నిజానికి ఆ పని తాను  మొదటే చేసి వుంటే  అది పక్షపాత వైఖరితో కూడుకున్నదని అనేవారేమోనని, కారణం ఆ కుర్రవాడు తన కుమారుడనీ, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 



కీ. శే. శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు  
                అవును..!! ఆరోజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది మా నాన్నగారే..(కీ. శే. శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు) !! వారు ఆరోజు వస్తారని నాకూ తెలియదు, నేను పాల్గొంటున్నాననే సంగతి వారికీ తెలియదు.  కాలేజి విద్యార్ధి ఇచ్చిన ఆపుస్తకం నాకు అపూర్వంగా అనిపించి ఇన్నాళ్ళూ భద్రంగా ఉంచుకున్నాను. అరవై ఏళ్ళు అయినా ఇప్పటికీ ఈ పుస్తకం లోని నీతి  పద్యాలని వల్లె వేసుకుంటూ ఉంటాను. నేటి విద్యా విధానంలో నీతి, ఆధ్యాత్మిక అంశాలూ చాలా వరకూ తక్కువైపోతుండడం తో విద్యార్ధులు భౌతికమైన విషయాలలో అభివృద్ధి చెందుతున్నా నైతికత విషయంలో వెనుకబడి పోతున్నారు. సరళ భాషలో  వ్రాయబడిన ఇలాంటి పుస్తకాలు ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. ప్రచారం కల్పించడం మన కర్తవ్యం.   
- రుద్రావఝల రామకృష్ణారావు, Block No.39 -A(BSP), Ruabanda Sector, భిలాయి - 6 
సెల్: 07587046455
వీరిదే ఇంకో చిత్రమైన రచనను ఇక్కడ చూడండి
 ************
                మిత్రనీతి  పుస్తకం వెల  అప్పట్లో రెండున్నర అణాలు. వేమన శతకం, సుమతీ శతకాలవలెనే  తేలికైన భాషలో వ్రాయబడింది. ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా దొరకక పోవచ్చు. ఆరోజుల్లో ఈపుస్తకం మీద అభిప్రాయాలు వ్రాసిన వారిలో విద్వాన్  మోటుపల్లి రామానుజరావు, MA (సీనియర్ లెక్చరర్, పచ్చియప్ప కాలేజీ, మద్రాసు) గారితోపాటూ మద్రాసు, తిరుత్తని, చిత్తూరుల నుంచి కూడా ప్రముఖుల, విద్యావేత్తల అభిప్రాయాలు ఉన్నవి.
               
                ఆ పుస్తకం నుంచీ మచ్చుకి కొన్ని పద్యాలు:
                                ఆత్మదేశమందు అభిమానమేలేని 
                                                పురుషు డే జగాన పుట్టనేమి..?
                                గిట్టనేమి? యతని పుట్టువు భాగ్యంబు 
                                                అడవి గాయు వెన్నె లౌను మిత్ర..!
                                                        -----------------

                                శాంతముననె కార్య సాధనంబు లభించు
                                                శాంతముననె చాల సౌఖ్య మబ్బు
                                 శాంతమునకునేది సరిరాదు..! శాంతమే 
                                                 భూషణం బటండ్రు బుధులు మిత్ర..! 
                                                         -----------------

                                 చెమటనోడ్చి కష్ట జీవనం బనకుండ 
                                                పవలు రేయి కూడ  పాటు వడుము
                                  సేద్యము ననె సుఖము చేకూరు; గృషి సేయ 
                                                 కరవు కాటకాలు గలవె ? మిత్ర..!
                                                        -----------------

ఈ పుస్తకాన్ని స్కాన్ చేసి మీ అందరికీ  పంచుతాను.            
          
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)