Sunday, December 11, 2011

'ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన' వారు నిర్వహించిన పోటీలు

ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన వారు ఈరోజు బాలబాలికలకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, లలిత సంగీతం, జానపద నృత్యం మొదలైన విభాగాలలో 5  నుంచి 15 సంవత్సరాల లోపు వారిని (జూనియర్స్) మరియు 15 నుంచి 25  సంవత్సరాల లోపు సీనియర్స్ కేటగిరీలలో పోటీలు జరిగాయి.
సుమారు ఒక్కో విభాగం లోనూ 30  మంది వరకూ పాల్గొన్నారు. ప్రతీ విబాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా రూ. 2116 /-, రూ. 1116/- లు ఇచ్చారు. వీరందరికీ మళ్ళీ, ప్రాంతీయ రాష్ట్రీయ స్థాయుల్లో మరలా పోటీలు నిర్వహిస్తారట.


శాస్త్రీయ సంగీతం జూనియర్స్ విభాగంలో మా అమ్మాయి కృష్ణప్రియకి ప్రథమ బహుమతి వచ్చింది. కాంభోజి వర్ణం పాడింది.
పూర్తిగా చదవండి...

Wednesday, November 30, 2011

విశాఖ లో గురజాడకు ఘననివాళి :: 'కన్యాశుల్కం' చిత్ర ప్రదర్శన


ఈ రోజు నవయుగ వైతాళికుడు, తెలుగు కథకి ఆద్యుడు, సంఘ సంస్కర్త, కీర్తి శేషులు శ్రీ గురజాడ అప్పారావుగారి వర్ధంతి. ఆయన 1915 వ సంవత్సరంలో పరమపదించారు. ఈ తరంలో వరకట్నం గురించే గాని, కన్యా శుల్కం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. ఆ రోజుల్లో కన్యాశుల్కం (పెళ్లి చేసుకొనేటప్పుడు అమ్మాయి తండ్రికి డబ్బులు ఎదురివ్వడం) కారణంగా ఎందరు చిన్నారుల బతుకులు బుగ్గిపాలయ్యాయో...? అప్పారావుగారు అదే అంశాన్ని ఇతివృత్తం గా చేసుకొని 'కన్యాశుల్కం' అనే నాటకం  వ్రాసారు. చాలా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి మూఢాచారాల పై తన వ్యంగ్యాస్త్రాలు సంధించి హాస్య రసాన్ని అద్భుతంగా పండించారు.
ఈ నాటకం సినిమా రూపంలో ఎన్టీ రామారావు, సావిత్రి, సీఎస్సార్, మొదలైనవారు ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కింది. రంగస్థలం మీద కూడా ఎన్నిసార్లు వెయ్యబడిందో లెక్కలేదు.
ఆ సినిమా ఈ రోజు అప్పారావుగారి 97 వ వర్ధంతి సందర్భంగా స్థానిక గురజాడ కళా క్షేత్రం లో vuda వారి సౌజన్యంతో ప్రదర్శితమైంది. దానికి ముందు కళాకారులు కన్యాశుల్కం లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. ఒక మూడు వందల మంది వచ్చి వుంటారేమో. కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారు.
ఈ సినీమా మరియు నాటకం లో భాగాలను ప్రదర్శించే ఆలోచన ఎవరిదో కానీ, వారినీ వూడా అధికారుల్నీ మనస్పూర్తిగా అభినందించాలి. ఆ మహనీయునికి ఇలాంటి నివాళి ఇచ్చినందుకు.

ఈపుస్తకాన్నిఆర్కైవ్.ఆర్గ్ నుండి ఈ దిగువ లింక్ ని నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కన్యాశుల్కం నాటకం పీడీఎఫ్ రూపంలో
 మొట్టమొదటి తెలుగు కథ గా చెప్పబడే 'దిద్దుబాటు' అప్పారావుగారి రచనే నని అందరికీ తెలిసిందే..!!
క్రింద బొమ్మలపై నొక్కి పెద్దవిగా చూడండి. 




పూర్తిగా చదవండి...

Sunday, October 16, 2011

'వేయి పడగలు' చదివేశానోచ్...!

అవును.. వేయి పడగలు నిజం గానే చదివేశాను..!
ఎన్నాళ్ళ నుంచో చదువుదామనుకొంటున్నపుస్తకం, సుమారు మూడేళ్ళ క్రితం విశాలాంధ్ర వారి పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకం, పేరు తప్ప దాని గురించి మరింకేదీ తెలియని పుస్తకం, మొత్తానికి మొదలెట్టి పూర్తిగా చదివేసాను. వారం రోజులకి పైనే పట్టింది చదవడానికి. ఎక్కడా స్కిప్ చెయ్యకుండా మొత్తం చదివాను.  దసరా ముందరి రోజుతో పూర్తయిపోయింది.

నవలను విశ్వనాధ సత్యనారాయణ గారు ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారట. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశారట. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు.
 
ఆ పుస్తకాన్నికొని దగ్గర మూడేళ్ళు కావస్తున్నాదాని సైజు చూస్తేనే భయమేసి కొంత (సుమారు 850  పేజీలు), భాష గ్రాంధికం కావడం కొంత నేనుమొదలుపెట్టడానికి ధైర్యం చెయ్యలేక పోవడానికి కారణాలు. అయితే మొదలుపెట్టిన తరువాత బాగానే వెళ్ళింది. చాలా ఇంటెరెస్టింగ్ గా వెళ్ళింది. విశ్వనాధ వారి భాష, శైలి ఎంతగా హత్తుకుపోయాయంటే.. మొదలుపెట్టిన మూడోరోజునుంచీ నేను గ్రాంధికం లో మాట్లాడడం మొదలెట్టాను. (ఇంట్లోనే లెండి..!). చివరకు వచ్చేసరికి, విశ్వనాధ వారివి పుస్తకాలు ఇంకేమేమి వున్నాయో, లేదా వారి రచనల పైన సమీక్షలేమైనా దొరుకుతాయేమోనని   (ఇంటర్నెట్లో) వెతుకులాట మొదలుపెట్టాను. మొత్తానికి హహాహుహూ, విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, ఏకవీర, ధూమ రేఖ, భగవంతుని మీది పగ, డా. ఎస్ గంగప్ప గారు వ్రాసిన 'వేయి  పడగలు - విశ్లేషణాత్మక విమర్శ' మొదలైన పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోగలిగాను. అలాగే పుస్తకం.నెట్ లో గుప్తపాశుపతము మొదలైన పుస్తకాల పై సమీక్షలు చూసాను. విశ్వనాధగారి రచనలను ద్వేషించి వారి పై వ్యక్తిగతంగా కూడా విషం కక్కినవారు వారి కాలం లోనే ఎందరున్నారో.. ఇప్పటికీ వారినీ, వారి రచనలనూ నెత్తిన పెట్టుకొని పూజించే వారూ అంతకంటే ఎక్కువ గానే వున్నారు.
ఈ క్రింది లింకులు చూస్తే ఆ విషయం బోధపడుతుంది. 



విశ్వనాధ సత్యనారాయణ గారు ఈపుస్తకం లో ఆనాటి సమకాలీన పరిస్థితులను పాత్రలకు అన్వయిస్తూ వివరిస్తారు. సంవత్సరాలు, ఋతువులూ వర్ణిస్తారు. కధా రంగం అయిన సుబ్బన్న పేటనూ, మూడు నాలుగు వందల సంవత్సరాల ఆ ఊరి చరిత్రనూ  చెబుతూ ఆ చిన్న పల్లెటూరు ఒక మోస్తరు పట్టణంగా రూపాంతరం చెందడం, దానికి దారి తీసిన పరిస్థితులూ విపులం గా చర్చిస్తారు. ఊరిలో వుండే ముఖ్య మైన కుటుంబాలైన, జమిందారు కుటుంబం, వారికి మంత్రులుగా వ్యవహరించే బ్రాహ్మణుల కుటుంబం, గణాచారి(ఈమె ఆ ఊరి కాపు యొక్క ప్రథమ సంతానం) గా పిలువబడే కాపు కుటుంబం యొక్క మూడు నాలుగు తరాలను కళ్ళముందు ఉంచుతారు. ఈ మూడు కుటుంబాల వారూ కలసి నెలకొల్పిన సుబ్రహ్మణ్యేశ్వరుడే వేయి పడగలతో అలరారుతుంటాడు. ఊరి సంప్రదాయాలూ, నమ్మకాల పట్ల తరాలు మారే కొద్దీ వచ్చే అంతరాలూ, పాత్రలకు వయసు పెరిగే కొద్దీ వారిలో కలిగే  వ్యక్తిత్వ వికాసం మొదలైన విషయాలను పాత్రల మనో విశ్లేషణ, వారి మధ్య సంభాషణల ద్వారా అద్భుతంగా నడిపిస్తారు.
*******************************************************************************
వికీపీడియా సౌజన్యంతో:
నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం మరియు దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అదే విధమైన అభిప్రాయాలను వారి కుమారుడు విశ్వనాధ పావనిశాస్త్రి కూడా 1987లో ఆంధ్ర పత్రిక సీరియల్లో item box లలో వెలిబుచ్చారు. అందులోని పాత్రలు, స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు

సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు; మేరుగోపాలస్వామి ఆలయం - విశ్వేశ్వరస్వామి ఆలయం; కృష్ణమనాయుడు - నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు, రంగయ్యప్పారావు; రామేశ్వర శాస్త్రి - విశ్వనాధ తండ్రి శోభనాద్రి; ప్రధాన పాత్ర ధర్మారావు - విశ్వనాధ సత్యనారాయణే; సూర్యపతి - కొల్లిపర సూరయ్య చౌదరి; కుమారస్వామి - కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావు; కేసవరావు - కోపెల్ల హనుమంతరావు; రుక్మిణమ్మరావు - ముట్నూరి కృష్ణారావు శ్రీమతి; నాయరు - బందరులోని ఒక కిళ్ళీకొట్టు ఓనరు;
గుంటూరు .సి. కాలేజిలో మత సంబంధమైన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వివాదంలో విశ్వనాధ తన ఉద్యోగాన్ని వదులుకోవలసివచ్చింది. ఉద్యోగం పోయి మరొక ఉద్యోగంలో చేరని దశలో నవల వ్రాయబడింది. నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ జీవితంలో ఇతరులతో జరిగిన విభేదాలను చాలావరకు ప్రతిబింబిస్తాయి.
 
విశ్వనాధ వారి వేయిపడగలు మొదటి భాగపు చిత్రము
నవలను విశ్వనాధ వారు అంకితమిస్తూ ఇలా రాసుకొన్నారు-
నీవొక పెద్ద వెల్గువయి నీ వెలుగారిన నాదు జీవిత
వ్యావృతి యీ కవిత్వ మనునట్టీ విచిత్రపు నీడ పారె
దేవీ'అరుంధతీ ప్రముఖ దివ్యమహా పరిలీన మూర్తి
నీ వెలుగుల్ పరోక్షమయి నేటికి నీడలు పారజొచ్చెడున్
*******************************************************************************
ఈ నవల మీద సమీక్షలు చాలా తక్కువగా కనిపించాయి. భావ నిక్షిప్త బ్లాగు నిర్వహిస్తున్న శ్రీ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు వ్రాసిన సమీక్ష చాలా నచ్చింది. ఈ క్రింది లింకులు నొక్కి ఆ సమీక్షని చదవొచ్చు. సంక్షిప్తంగా కథ మొదటి మూడు భాగాల్లోనూ, చివరి భాగం లో విశ్లేషణ ఇచ్చారు.

విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - రెండవ భాగం 

విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మూడవభాగం

విశ్వనాథ సత్యనారాయణ - వేయిపడగలు - విశ్లేషణ 

VeyiPadagalu - A review  sarath krishna బ్లాగు లో వ్రాసిన రివ్యూ (ఇంగ్లిష్ లో) చూడండి.

వేయిపడగలు – శ్రీ విశ్వనాథ సత్యనారాయణ - పుస్తకం.నెట్ లో శ్రీవల్లి రాధిక గారు వ్రాసిన సమీక్ష

వీరందరికీ పేరుపేరునా మనఃపూర్వక ధన్యవాదాలు.

డా. ఎస్ గంగప్ప గారు వ్రాసిన 'వేయి  పడగలు - విశ్లేషణాత్మక విమర్శ' పుస్తకము ఆర్కైవ్.ఆర్గ్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

(ఈ నవల నా అంతట నేనుగా సమీక్ష వ్రాయడానికి.. "ఇంకా ఒకసారే కదా చదివాను...! అందుకే ఇంకోసారి చదివాకా నైనా వ్రాయగలనేమో చూస్తాన"నుకోని ఈసారికి ఇలా కానిచ్చేశాను..!)

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)