Monday, January 13, 2020

పోతన కవితా చమత్కృతి - రవిబింబంబుపమింప పద్యం:

బమ్మెర పోతన ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో, వామనుడు త్రివిక్రమావతారుడై పెరిగిపోయే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించిన పద్యం ఇది.

మత్తేభము.
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై/
శ్రవణాలంకృతియై, గళాభరణమై సౌవర్ణ కేయూరమై/
ఛవి మత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర/
ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్!

ఒక గీతను చెరపకుండా చిన్న గీత చెయ్యాలి అంటే ఏంచెయ్యాలో మనకందరకూ తెలిసిన సంగతే! దాని ప్రక్కనే మరో పెద్ద గీత గీస్తే సరి..! ఒక వస్తువు పెద్దదా చిన్నదా అని తెలియాలి అంటే దానితో పోల్చి చెప్పడానికి ప్రక్కన ఇంకో వస్తువు ఉండాలి. అలా చెప్తే మనం పోల్చిన ఆ వస్తువుయొక్క గుణము ఎంత పెద్దదో లేదా చిన్నదో తెలుస్తుంది. మనం విమానం లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఆకాశంలో చుట్టుపక్కల మేఘాలో మరింకొకటో ఏమీ లేకపోతే మనం కదులుతున్నట్టే అనిపించదు. నిజానికి మనం చాలా వేగంతో వెళ్తూ ఉంటాం.  అదే విమానం లో మనం నేలపైకి దిగినప్పుడు వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న పరిసరాల్ని చూస్తే విమానం ఎంతవేగంతో వెళ్తోందో మనకి అనుభవం లోకి వస్తుంది. 
పై చిత్రాలు రెండూ కీ. శే. బాపు గారివి. వారికి నా కృతజ్ఞతాంజలి.
ఎత్తు- పల్లం, పొడుగు- పొట్టి,  పెద్ద - చిన్న ఇలాంటి వాటికి ఏదో ఒకటి పోల్చడానికి ఉండాలి. ఎందుకంటే అవన్నీ సాపేక్షం కాబట్టి..!  
ఇప్పుడు మనం మన పద్యంలోకి వచ్చేద్దాం..! ఇక్కడ వామనుడు త్రివిక్రముడై భూనభోంతరాలు దాటి పెరుగుతున్నాడు. విశ్వమంతా వ్యాపిస్తున్న అతనిని కొలవాలి, లేదా ఎంతగా వ్యాపిస్తున్నాడో చెప్పాలి అంటే మనకు బాగా తెలిసిన, రోజూచూసే దానితో పోల్చి సాపేక్షంగా చెప్తే బాగా తెలుస్తుంది.       
పోతన ఆ పొలికకు రవి బింబాన్ని ఎన్నుకున్నారు. ఎదుగుతూ ఉన్న వామనుడు ఎంతగా పెరిగాడంటే,
మొదట అతనికి ఛత్రము (గొడుగు) వలె శోభించిన రవి బింబము, తరువాత శిరోరత్నము వలె, చెవి ప్రోగు వలె, కంఠాభరణము వలె, బంగారు దండకడియము వలె, కంకణము వలె, మొలత్రాడులో గంట వలె, కాలి అందె వలె చివరకు పాదం క్రింద పీట వలె భాసించిందట..! గమనించవలసిందేమంటే ఇక్కడ ఈ పొలికలన్నీ పురుషులు తమ శరీరంలో తలనుంచి పాదం దాకా ధరించే వివిధము లైన ఆభరణాలను సూచిస్తున్నాయి. 
ఇక్కడ సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. సూర్యుడు గొడుగు గాను, పాద పీఠం గానూ ‘మారలేదు’. అలా కనిపించాడు అంతే..! ఉపమానానికి అంటే పోల్చడానికి పాత్రమయాడు అని పోతన్న గారే చెప్పారు. అంటే వామనుడు పెరుగుతూ సూర్యుణ్ణి కూడా ఎంతలా దాటి పోయాడంటే గొడుగు వలె కనిపించిన సూర్యుడు అంతలోనే పదపీఠం వలె కనిపించాడట..!                        
ఈ పోలిక ద్వారా వామనుడు త్రివిక్రముడైన రూపం మనకు ఊహించుకోవడానికి ఒక కొలమానం (స్కేల్) ఇచ్చారు పోతన గారు. ఇప్పుడు ఆ ఊహతో ఆ కొలమానాన్నిబట్టి పద్యాన్ని మళ్ళీ చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో..!
సూర్యుడే మనకి చాలా దూరంలో ఉంటాడు, అలాంటిది మరి ఆ సూర్య బింబం త్రివిక్రముడైన వామన మూర్తికి పాద పీఠం గా అమరింది అంటే ఆ స్వామి ఎంతగా పెరిగాడో తెలుస్తుంది..! (తెలుస్తుందా..!?) 

 

ఈ పద్యాన్ని స్వరపరచిన ప్రముఖ సంగీత కళాకారిణి సంగీత సుధానిధి శ్రీమతి మండ సుధారాణిగారు తమ స్వర రచనలో చూపిన చమత్కృతి గమనించండి. ఎంతో ఎత్తున ఉన్న సూర్యుడు అలా అలా క్రిందికి దిగుతున్నట్ట్లు కనిపిస్తున్నాడని కదా పోతన గారి వర్ణన..!? అదే కవి హృదయాన్ని అనుసరిస్తూ పద్యాన్ని తారస్థాయిలో మొదలుపెట్టి మారుతున్న సూర్యుడి స్థానానికికి తగ్గట్టుగా ఒక్కక్క స్థాయికి స్వర సంచారాన్ని అవరోహణ చేయిస్తూ వచ్చి పదపీఠమై అన్న దగ్గర మంద్రస్థాయి షడ్జంలో నిలిపారు.

కాని ఆ సమయంలో వటువు త్రిభువనాలు దాటి ఎదుగుతున్నాడే, మరి ఆ స్వామిని దర్షించాలంటే ఎంత తొందరగా మనం ఆ ఎత్తుకి వెళ్ళాలి? అందుకే శ్రోతలకు ఆ గమనాన్ని సూచించేటట్లుగా ’వటువు తా బ్రహ్మాండమున్ నిండుచోన్’ అంటున్నప్పుడు స్వరాలను మంద్ర స్థాయినుంచి మధ్యమ తారస్థాయి లను దాటించి అతి తారస్థాయికి వేగవంతమైన సంచారం చేయించి త్రిభువనాలను దాటి వెళ్ళాడన్న కవి భావాన్ని తమ స్వరకల్పనలో ఆవిష్కరించి, స్వామి వారి హృదయస్థానమైన తారస్థాయిలో పద్యాన్ని నిలిపారు. పై వీడియో లో పద్యాన్ని ఆలపించింది శ్రీమతి సుధారాణిగారివద్ద వద్ద శిష్యరికం చేస్తున్న మా అమ్మాయి చి. కృష్ణప్రియ.
సర్వవ్యాపి ఐన విష్ణువు మనందరకూ శుభము కలుగజేయు గాక..!
పూర్తిగా చదవండి...

Friday, December 20, 2019

చిరుతను కనిపెట్టగలరా..!?


కందము.
చూచితి చిరుతను; గుట్టుగ/
వేచెను తా నీడనుండి వేటాడుటకున్/
నీచుని తలపుల వోలెను/
దాచుక యా క్రూర మృగము తన రూపు తగన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(27.07.2019)
పూర్తిగా చదవండి...

Friday, October 18, 2019

నా విజయవాడ ప్రయాణం..!!


Related image

2018 అక్టోబరు నెల ఆఖరు వారంలో ఒకనాటి రాత్రి VSKP LTT EXP లో విశాఖపట్నంనుండి విజయవాడ వెళ్ళడానికి బయలుదేరాను. నాది 2nd AC కోచ్. విశాఖలో నేను ట్రైన్ ఎక్కే సరికి 11.00 దాటింది. బెజవాడలో పొద్దున్న ఆరుంపావు కరెక్ట్ టైము..! విశాఖలో నేను ఎక్కే సరికే అంతా సర్దుకొని పడుకుండి పోవడానికి సిద్ధమౌతున్నారు. నాది అప్పర్ బెర్త్..! సరే లెమ్మని, ఎవరితోనూ మాట కలపకుండా హాయిగా పైకెక్కి పడుకోవడానికి ఉపక్రమించాను.
మామూలుగా రగ్గు, దానిమీద దుప్పటి పరచుకొని మరో దుప్పటి కప్పుకుంటాను (రగ్గులు నెలల తరబడి ఉతకరు అని ఎన్నోసార్లు విన్నాను, వాటిని ఎంతబాగా టాయ్‍లెట్ల దగ్గర, ప్లాట్‍ఫారాల మీద దొర్లిస్తారో కళ్ళారా చూసాను, అందుకని చచ్చినా కప్పుకోను). కాని ఆరోజు కోచ్ లో బాగా చలిగా ఉండడంతో చాలా సేపు నిద్రపట్టక బెర్త్ మీద దొర్లుతూనే ఉన్నాను. మిగతా వాళ్ళని చూస్తే అందరూ రగ్గుల్లో ముసుగుతన్ని పడుకున్నారు. నేను ఆ చలి భరించలేక అర్ధరాత్రి దాటాక అటెండెంట్ కోసం వెదికి, విఫలమై టి.టి కనిపిస్తే అతగాడిమీద ఫైర్ అయిపోయాను..! ఇది రైలు పెట్టా, మార్చురీయా.. అంటూ..!! ఎవర్నైనా పంపుతానన్నాడు కాని ఎవడూ రాలేదు.    
సుమారు 3.30 అవుతూంటే ఇక లాభంలేదని పై దుప్పటి మీద రగ్గు కప్పుకొని పడుకున్నాను. ఆ పడుకోవడం గాఢంగా నిద్ర పట్టేసింది. ఎప్పుడూ నేను 5.00 – 5.30 మధ్యలో లేచిపోతాను. ఎప్పటినుంచో అదే అలవాటు. ఈ ట్రైన్ 6.15 కి కదా అని అలారం కూడా పెట్టుకోలేదు. అదే నా కొంప ముంచింది. విజయవాడ స్టేషన్ వచ్చే టైముకి బాగా నిద్ర పట్టేసింది. స్టేషన్ దాటిపోయాక మెలకువ వచ్చింది. తెలివొచ్చి చూస్తే చుట్టూ నిశ్శబ్దం..! నా కుపే అంతా ఖాళీగా ఉంది. ఒక్క ఉదుటన క్రిందికి దిగి చూద్దును కదా ట్రైన్ చాలా వేగంగా వెళ్ళిపోతోంది. విజయవాడ ఇంకా రావాలో దాటిపోయిందో అర్థం కాలేదు. మిగతా కోచ్ లో చాలా పలచగా ఉన్నారు జనం, ఆ ఉన్న కొద్దిమందీ పడుకొని ఉన్నారు. ఫోన్ లో సిగ్నల్ లేదు. ఎవర్ని అడగాలా అని అనుకుంటూ ఫోన్ లో సిగ్నల్ రాగానే చూస్తే గుండె గుభేల్ మంది. విజయవాడ ఆరున్నరకి వదిలేసి ఇప్పుడు కాజీపేట దిశగా పరుగులు పెడుతోంది ట్రైన్. ఏంచెయ్యాలో తెలియలేదు. సామాను పట్టుకొని గేట్ దగ్గరకి వెళ్ళిపోయాను.
VSKP LTT EXP విజయవాడ దాటితే మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ కాజీపేట అని చూపిస్తోంది. నాకేమో విజయవాడలో మీటింగ్ ఉంది. ఇంక చూసుకో.. గేట్ దగ్గర నిలబడి ఎక్కడ స్లోఐతే అక్కడ దూకేద్దామని కాసుకు కూర్చున్నాను. ట్రైన్ ఎక్కడా అస్సలు ఆగలేదు, స్లో అవలేదు..
అప్పుడు కనబడ్డాడు మా టి.టి..! ఇతడు విజయవాడలో ఎక్కాడు. మాకోచ్ లోకి అదే రావడం..!! నావాలకం చూసి సంగతేంటని అడిగి అప్పుడు తాపీగా చెపాడు.. ప్రొద్దున్న ఆరు గంటలకే విజయవాడ చేరిన బండి, అరగంట ఆగిందిట. ఒకరిద్దరు దిగారు కూడానట..! ఐనా నాకు తెలివి రాలేదు. సరిగ్గా స్టేషన్ దాటిన 20-25 ని. లకి తెలివొచ్చింది. విజయవాడలో నా బెర్త్ లోకి ఎవరూ రాలేదు. టి.టి, అటెండర్‍లకి నేనేమీ చెప్పలేదు, అక్కడ ఎవ్వరూ జాయినవ్వక పోవడంతో వాళ్ళూ నన్ను గమనించలేదు, లేపలేదు..!
ఒక రెండున్నర గంటల ప్రయాణం తరువాత మధిర స్టేషన్ దగ్గర కొంచం స్లో అయింది. ప్లాట్ ఫాం పక్కనుంచే వెళ్తోందని దూకబోయేసరికి టి.టి. వచ్చి అలాంటి సాహసాలు చెయ్యొద్దని చెప్పాడు. ఆ స్పీడుకి దొర్లి ట్రైన్ కిందకి వచ్చేసిన వాళ్ళని చూసామన్నాడు. ఎందుకంత రిస్కని విరమించుకొని మళ్ళీ వెళ్ళి సీటులో కూర్చున్నాను. మరి కొంత దూరం పోయాక బోనకల్లు అనే ఊరి దగ్గర సిగ్నల్ లేక ట్రాక్ మీదే ఆగింది ట్రైన్. చుట్టూ పొలాలు ఉన్నా, రోడ్డు ఏదో కాస్త దగ్గరలోనే కనిపిస్తోంది..! సరే ఏదైతే అయ్యిందని నా స్ట్రాలీ బ్యాగ్‍తో పాటు అక్కడ దిగిపోయాను.
దగ్గరే అనుకున్న రోడ్డు ట్రాకు పక్కన కంకర రాళ్ళకుప్పల మీదా, తుప్పలకి అడ్డంబడి, అరగంట నడిస్తేగాని రాలేదు. బ్యాగు లో లాప్ టాప్, షూస్, మీటింగ్ కి కావలసిన డ్రాయింగ్స్, బట్టలు, - ప్రతి సారీ తీసుకెళ్ళేవే - ప్లాట్‍ఫారం పైన చక్రాల  మీద లాగుతూ చాలా సౌకర్యవంతంగా ఉంది అనుకున్నది కాస్తా ట్రాకు పక్కన రాళ్ళమీద ఎత్తుకొని నడుస్తూ ఉంటే దాని బరువెంతో చేతులకి బాగా తెలిసొచ్చింది. తీరా రోడ్డు చేరాక అది మట్టి రోడ్డు, దుమ్ము మయం..!!
ఆ మట్టి రోడ్డు నుంచి ఊరి సెంటర్ కి ఇంకో పావుగంట పెట్టి ఈడ్చుకుంటూ నడిచి మొత్తానికి బస్టాప్ చేరాను.
అక్కడకి ఖమ్మం నుంచి రావాలట బస్సులు..! ఎంతకీ రావు..! బెజవాడకి టాక్సీలు ఏమైనా ఉంటాయేమోనని ఆరాతీస్తే రెండున్నర వేలవుతుందన్నాడు..!! వేలే..!!? రూపాయలే..!!?? అమ్మయ్యో అనుకొని.. ఆఖరికి ఒక ఆటో వాడితో మాట్లాడితే ఇంకాస్త పై జంక్షన్‍కి హైవే దాకా వెళితే అక్కడికి బస్సులొస్తాయని, రెండు వందలు ఇమ్మన్నాడు. బేరమాడితే నన్ను  ₹150/- అడిగాడు, ఇంకా మరో ఇద్దరు ముగ్గుర్ని కూడా ఎక్కించుకోనివ్వాలన్నాడు. సరే ఏదో ఒకటి ఏడూ అని ఆ ఆటో ఎక్కి కూర్చున్నాను. అది మొదలు.. వాడు మనిషి కనబడగానే ఆటో ఆపేసి త్రోవలో ఊళ్ళపేర్లు చెప్పి అరవడం మొదలు పెట్టాడు. అలా జనాలని ఎక్కిస్తూ, దింపుతూ షేర్ ఆటో టిక్కెట్లన్నీ కిట్టుబాటు చేసుకొని వాడు చెప్పిన ఆ చిలకల్లు అనే ఇంకో ఊరికి చేర్చాడు. అది హైవే కి ఆనుకొని ఉంది. బస్సుల ఫ్రీక్వెన్సీ కాస్త ఎక్కువ అన్నారు.
ఒక అరగంట వెయిట్ చేస్తే మొత్తానికి RTC వాళ్ళది ఏదో పాసింజర్ బస్సు వస్తే అదెక్కి సుమారు 12:30 దాటాక చేరాను బెజవాడ..!
విజయవాడ పోలీస్ కమిషనర్ తో మీటింగ్..! అదృష్టవశాత్తూ ప్రత్యేకించి టైమ్ తీసుకోలేదు కలవడానికి. బెజవాడ చేరాక ఫోన్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటలకి రమ్మన్నారు. మొత్తానికి మీటింగ్ బాగానే జరిగింది. ఆయన DGP దగ్గరకి కూడా సాయంత్రం తీసుకెళ్ళి నా డిజైన్ explain చేయించారు. ఆయనతో ఒక నలభై ఐదు నిముషాలు ప్రెజెంటేషన్.. అదికూడా బాగా జరిగింది. He was impressed and approved our proposal and design..!
ఆ విధంగా చివరికి కథ సుఖాంతమైంది. 😊😇👍
పూర్తిగా చదవండి...

Sunday, July 10, 2016

పద్యంతో తలచుకున్న అక్షరాన్ని కనిపెట్టడం

జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఈ పద్యం కళ్ళబడింది. శ్రీ దీపాల పిచ్చయ్య  శాస్త్రి గారు వ్రాసినదట
1. అరిభయంకర చక్రకరి రక్షసాగర
చాయ శ్రీ కర్బుర సాటియుగళ

2. నాళీక సన్నిభ నయన యండజ వాహ
వాణీశ జనక వైభవ బిడౌజ!

4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష
వరజటి స్తుత శౌరి వాసుదేవ!

8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమ గరుడ

16. దోష శైలేశ శశిద్రక్ష** ద్రుహిణ హేళి
(’శశిద్రక్ష’ కు సవరణ క్రింది వ్యాఖ్యలో పొందుపరచడమైనది. గమనించగలరు)


ఇప్పుడు తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో ఏదైనా ఒకటి మనసులో తలుచుకోండి.. తర్వాత పైన పద్యంలో ఆ అక్షరం ఏయే పాదాలలో ఉందో చెప్పండి చాలు.. మీరు అనుకున్న అక్షరం నేను చెప్తాను..
తలుచుకోవడంలో కొన్ని నియమాలు పాటించాలి.
అచ్చుల్లో 'అ' మాత్రమే తలుచుకోవాలి. హల్లుల్లో ఙ్, ఞ్, మాత్రం వదిలేయాలి. 
న - ణ, ల - ళ, ర - ఱ లకు తేడా ఉండదు. 
ఒక అక్షరం గుణింతాలు అన్ని ఒకటే అక్షరం కిందే భావించాలి.
ఈ ప్రహేళికకు పరిష్కార వాక్యం ఇది.. 

అన్నయ్య తోటి విస్సాప్రగడ కామరాజు భాషించు హేళి దాక్షిణ్యశాలి

అ - 1
న్న - 2
య్య - 3
తో - 4
టి - 5
వి - 6
స్సా - 7
ప్ర - 8
గ - 9
డ - 10
కా - 11
మ - 12
రా - 13
జు - 14
భా - 15
షిం - 16
చు - 17
హే - 18
ళి – 19
దా – 20
క్షి - 21
ణ్య- 22
శా - 23
లి - 24


ఎదుట వ్యక్తి తలుచుకున్న అక్షరం ఉన్న పాదాల నంబర్లను కూడగా వచ్చిన నంబరును ఈ వాక్యంలో చూసుకుని దానిపక్కన ఉన్న అక్షరం చెప్పండి అంతే...ఉదా... ఎదుట వ్యక్తి 'ర' అనుకున్నాడనుకోండి. అది 1, 4, 8, పాదాలలో ఉంది. ఆ నంబర్లను కూడితే 13 వస్తుంది. పైన పైన పరిష్కార వాక్యంలో 13 పక్కన ఉన్న అక్షరం ర... ఈజీగా ఉంది కదా..!
ఇంతవరకు జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఉన్నదే..! అయితే వారిచ్చిన పద్యంలో నేను గమనించింది ఇది:

16 నెం. కు ఎదురుగా ఉన్న పాదం లో రెండు వాక్యాలు ఉండాలేమో అనుకుంటున్నాను. ఉదా. కి చ తలుచుకున్నా మనుకోండి. పరిష్కార వాక్యం ప్రకారం 17వ అక్షరం ’చ’. కానీ మీరిచ్చిన సీస పద్యం లో ’చ’ కేవలం ఒకటవ పాదం లో మాత్రమే ఉంది. అదే 16వ పాదం లో ఇంకో వాక్యం ఉండి, దానిలో’చ’ కలిగి ఉంటే 1+16 =17 లెక్క సరిపోయేది.
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పద్యం పూర్తిగా ఎవరి వద్దనైనా ఉంటే క్రింది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు.
పూర్తిగా చదవండి...

Tuesday, May 6, 2014

మా కేదార్ నాథ్ యాత్ర..!

                    కేదార్ నాథ్ యాత్రికుల వెతలు చూస్తే గుండె బరువెక్కని భారతీయ హృదయం ఉండదు. తమ తోటివారిని కళ్ళముందే పోగొట్టుకొని బ్రతుకుజీవుడా అంటూ ఒడ్డు చేరుకున్న జీవచ్చావాలను చూస్తే  కడుపు తరుక్కుపోయింది. ప్రకృతి అందాలకు కొలువై దేవభూమిగా గణుతికెక్కిన ఉత్తరాఖండ్ ప్రళయకాల రుద్రుని తాండవానికి చిగురుటాకువలె వణికిపోయింది. మరుభూమిగా మిగిలిపోయింది.

                    2008 మే లో మా మామయ్య శ్రీ శ్రీనివాస్ కుటుంబం, మా తాతగారు, అమ్మమ్మ గారూ, మిగతా బంధుగణం కలసి కేదారనాథ్, బదరీ నాథ్, యాత్రకు ప్లాన్ చేశారు. వాళ్ళు మొత్తం 16 మంది. ఢిల్లీ నుంచి బయలుదేరి, హరిద్వార్, ఋషీకేశ్ మీదుగా ద్వి - ధామ యాత్ర ( గంగోత్రి, యమునోత్రి కూడా కలిపితే చార్ధామ్ యాత్ర అవుతుంది) చేసి మళ్ళీ ఢిల్లీ కి బయలుదేరిన నాటినుంచి ఆరవ రోజుకి వచ్చేటట్టు ' సదరన్ ట్రావెల్స్ ' లో బుక్ చేసుకున్నారు. అప్పటికి మా నాన్నగారూ, అమ్మ అమెరికాలో మా తమ్ముడి వద్ద ఉన్నారు. వాళ్లకి విషయం తెలిసి వీళ్ళుకూడా  బయలుదేరడానికి సిధ్ధపడ్డారు. నాకు ఫోన్ చేసి టిక్కెట్లు తియ్యమని అడిగేసరికి, సరే అని తీసేశాను. మే లో బయలుదేరాలి. మావాళ్ళు అమెరికా నుంచి ఏప్రెల్ లో వచ్చారు. మా రెండో సంతానం కృష్ణ ప్రీతమ్ కు అప్పటికి మూడునెలలు. మాశ్రీమతి ఎలాగూ వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉంది ఇంకా. దాంతో ముందు అనుకోకపోయినా మా పేరెంట్స్ ని ఒంటరిగా పంపించడం ఇష్టంలేక (మా మామయ్య వాళ్ళు ఉన్నా, వాళ్ళు బయల్దేరుతున్న బృందంలో మూడోవంతు అంటే 14 మంది చిన్నపిల్లలూ, వృద్ధులూనూ..!) అప్పటికప్పుడు టిక్కెట్లు కొనుక్కొని నేనూ బయల్దేరాను. మా ముగ్గురితో కలిపి యాత్రకు వెళ్తున్న వాళ్ళం మొత్తం 19 మందిమి. ఢిల్లీ నుంచి బయల్దేరే మా 25 సీటర్ బస్సులో శ్రీకాకుళం నుంచి వచ్చిన జంటలు రెండు కాక మరో జంట ఉన్నారు. చిట్టచివరి సీటు నాదే.


                    ఢిల్లీ నుంచి తొలిరోజు రాత్రి బయల్దేరి తెల్లవారేసరికి హరిద్వార్ చేరుకున్నాం. అక్కడ హడావిడిగా స్నానాదికాలూ, టిఫిన్లు, ముగించి బయల్దేరి ఋషీకేశ్ కి మధ్యాహ్నం అవుతూ ఉండగా చేరుకున్నాం. శ్రీ శివానంద ఆశ్రమం, రామ్ ఝూలా, స్వర్గ ఆశ్రమం, గీతా ఆశ్రమం, లక్ష్మణ్ ఝూలా, లను దర్శించి భోజనం చేసి, శ్రీనగర్ కు ప్రయాణమయ్యాం. త్రోవలో మేం చూసిన ప్రకృతి రమణీయత, పచ్చదనం, అనుభవించిన కాలుష్య రహిత వాతావరణం, ప్రశాంతత మమ్మల్ని పరవశుల్ని చేసింది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. మొత్తం బృందంలో వయస్సులో చిన్నవాళ్ళు  మా మామయ్య పిల్లలు , అందరిలోకీ పెద్దలు మా తాతగారూ, అమ్మమ్మ కూడా ఆ ఉత్సాహాన్నీ ఉల్లాసాన్నీ సమానంగా అనుభవించారు. ఆ రాత్రికి మేము క్షేమంగా శ్రీనగర్ చేరాం. షెడ్యూల్ ప్రకారం మేము ఆరోజు సాయంత్రానికి గౌరీకుండ్ చేరుకొని శ్రీనగర్ లో బస చేసి, ప్రొద్దున్నే గౌరికుండ్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ ఊరికి (శ్రీనగర్) చేరే రోడ్డు, విరిగిన కొండచరియల మూలంగా మూసుకుపోవడం తో, ఆ రాత్రి రోడ్డు మీదే బస్సులో గడపవలసి వచ్చింది. ఇక్కడినుంచి మా ప్రయాణం సస్పెన్సు థ్రిల్లర్ ను తలపించింది.







 






 

 


                    తెల్లవారకుండానే బయల్దేరి నేరుగా 'గౌరీకుండ్' కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. రోడ్డుకు ఒకపక్క కొండ, మరోపక్క 500 అడుగుల లోయ, లోయ వెంబడి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నగంగమ్మ..! చుట్టూ కాటుకని తలపించేలాంటి కటిక చీకటి..!  వీటన్నిటికీ తోడు ఎముకలు కోరికే చలి.

                గౌరీ కుండ్ అనేది 'సహజ సిద్ధ ఉష్ణ జల కుండం'. చుట్టూ అంత చలిగా ఉన్నాఈ స్నాన వాటికలో మాత్రం వేడినీరు మరుగులెత్తిపోతూ ఉంటుంది. ఒక గుడ్డలో బియ్యాన్నికట్టి ఆనీళ్ళలో పది నిముషాల సేపు ఉంచితే ఉడికిపోయి అన్నం గా మారిపోవడం చూస్తాం. చుట్టూ గడగడ లాడించే చలి మధ్యలో ఇలాంటి వేడినీటి స్నానం మన ప్రయాణ బడలికని ఎగరగొట్టి నూతనోత్సాహాన్ని నింపుతుంది. అక్కడ స్నానాలు చేసి కేదారేశ్వరుడి దర్శనానికి సమాయత్తమయ్యాం. గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ ఆలయం పద్నాలుగు కిలోమీటర్ల ప్రమాద భరితమైన నడక దారి. నడవలేనివారి కోసం గుర్రాలూ, డోలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళే కాలిబాట పాదాల దగ్గర ఒక విశాలమైన స్థలంలో వందలాదిగా గుర్రాలూ, ఇసకవేస్తే రాలనట్టుగా మనుషులు...! అన్నీటోకెన్ పద్ధతిలో ముందస్తు చెల్లింపుల ద్వారా  "రానూ - పోనూ" కలిపి ఛార్జి చెయ్యబడతాయి. అయితే ఈ ప్రయాణానికి ఒక్కొక్క ప్రయాణ సాధనం తీసుకొనే సమయం  ఒక్కక్క రకంగా ఉంటుంది. కొండ దిగువన అంత జనాభా చూశాకా మేమందరం డోలీల మీదే కొండపైకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. ఒక్కొక్కరికీ ఒక్కో డోలీ, ఒక డోలీని  నలుగురు వ్యక్తులు మోస్తారు. కొండపైకి చేరడానికి సుమారు మూడుగంటల సమయం పడుతుందన్నారు. నేను మా ముగ్గురు డోలీల వాళ్ళనీ పిలిచి మేము ముగ్గురం ఒకేసారి మీదకు వెళ్లాలనీ, మధ్య మధ్యలో ఆగుతూ ఒకరినొకరు గమనించుకుంటూ వెళ్లాలని చెబితే సరేనన్నారు. అలాగే కొండపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్  అందడం కష్ట మవుతుందనీ, పోర్టబుల్ ఆక్సిజన్ సిలెండర్లు వెంటతీసుకు వెళ్లాలనీ మా గైడు మాకు చెప్పి మా చేత కొనిపించాడు. వాడే అవసరం రాకపోతే నామమాత్రపు రుసుము తీసుకొని సిలెండర్లు వెనక్కి తీసుకుంటారు. మార్గమధ్యంలో వర్షం పడే అవకాశం ఉంటుందని రెయిన్ కోట్లూ, చలికి స్వెట్టర్లూ, లాంటి ముందు జాగ్రత్తలు, సరంజామా తో బయల్దేరాం.








********

Kedarnth / Badrinath Slideshow: Citraalu’s trip to 2 cities including Rishikesh was created with TripAdvisor TripWow!
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)