Tuesday, March 15, 2011

అమర చిత్ర కథ మరియు టింకిల్ సృష్టి కర్త - అనంత్ పాయ్



మొన్న యాదృఛ్చికంగా ఎన్డీటీవీ వీడియో లో శ్రీ అనంత్ పాయ్ గారి గురించీ కనిపిస్తే బ్లాగులో ఆయన గురించి వ్రాద్దామనుకొని.. లింక్ లు సేవ్ చేసుకున్నాను. కానీ చూడలేదు. ఒకటి రెండు రోజుల్లోనే శ్రీ సురేఖ గారి బ్లాగు చూసి విస్మయానికి గురయ్యాను. మన ముళ్ళపూడి గారు పరమపదించిన రోజునే శ్రీ పాయ్ గారు కూడా మనల్ని విడిచి వెళ్ళారని తెలిసి చాలా బాధపడ్డాను.

ఎన్డీటీవీ వీడియోలు :

http://www.dailymotion.com/video/xck91b_amar-chitra-katha-on-tv_shortfilms

http://www.dailymotion.com/video/xh89ee_how-uncle-pai-created-amar-chitra-katha_news#hp-v-v1


చందమామ, బాలజ్యోతి, బొమ్మరిల్లు, బుజ్జాయి, చదివేరోజుల్లోనే.. మాకు బాగా నచ్చిన మరో పత్రికటింకిల్’. అప్పుడే తెలుగులో రిలీజ్ అయింది. మేము రోజుల్లో భీమిలి లో వుండేవాళ్ళం. మా నాన్నగారు అక్కడే స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. మా తాతగారిల్లు విశాఖపట్నం కావడంతో రాకపోకలు ఎక్కువగానే వుండేవి. తాతగారింటికి వెళ్ళే ఆనందం ఎప్పుడైనా వుండేదే..!! అయితే... మాకు మరో రెండు కారణాలు కూడా వుండేవి..!! ఒకటి.. మాతాతగారింట్లో ఉండే లైబ్రరీ, రెండు.. ప్రయాణంలో మా నాన్నగారు మాకు కొత్తవి కథల పుస్తకాలు కొనేవారు.

మాతాతగారి ఇంటిలో పెద్ద లైబ్రరీ వుండేది..!! పుస్తకాలు అద్దెకిచ్చేవారు. బయట వాళ్ళ సంగతేమో గానీ.. మేము మాత్రం మళ్ళీ వెనక్కి బయలుదేరే దాకా ఎక్కువ సమయం లిబ్రరీ లోనే గడిపే వాళ్ళం. చందమామలూ మొదలైన వాటితో పాటు పాకెట్ నవలలు జానపదం నేపధ్యం లో వుండేవి. అవి చదువుతుంటే ఎన్ టీ ఆర్, కాంతారావు సినిమాలు చూస్తున్నట్టుండేది. పైగా ఒకసారి లైబ్రరీ లోకి వెళ్ళి తలుపేసుకుంటే మాగురించి అడిగేవాళ్ళు లేరు.


విశాఖ పట్నం నుంచీ ఆర్ టీ సీ బస్సు లో కాంప్లెక్సు నుండీ బయలుదేరి భీమిలీ చేరుకొనే వాళ్ళం. బస్సు ఎక్కే లోపల తప్పనిసరిగా అక్కడ వుండే బుక్ స్టాల్ లో కొన్ని పుస్తకాలు కొనుక్కొని బయలుదేరేవాళ్ళం. అంతకు ముందు నుంచీ కూడా ఈనాడు దిన పత్రికలో అడుగున కుడిచేతిపక్క పేజీ ఎత్తి చూస్తే అమరచిత్రకథ వాళ్ళవి బొమ్మల కథలు తెలుగులొ వుండేవి. ౩౦ రోజులపాటు ధారావాహిక గా వచ్చేవి. దశావతారాలు, నారద గాధలు, అభిమన్యుడు, భగవద్గీత, అర్జున గర్వభంగం, ఇలా చాలా వచ్చేవి. కధ పూర్తి కాగానే వాటిని జాగ్రత్తగా కత్తిరించి పుస్తకాలుగా కుట్టుకొనేవాళ్ళం. అయితే పుస్తకాలన్నీరంగుల్లో అమరచిత్రకథ వారి పుస్తకాలుగా కాంప్లెక్సు లో దొరికితే అవికూడా కొనుక్కొనే వాళ్ళం.




సరిగ్గా ఆరోజుల్లోనే మొట్ట మొదటి సారిగా టింకిల్ తెలుగులో విడుదలయింది. అప్పుడే మొదటిసారిగా శ్రీ అనంత్ పాయ్ గారి పేరు చదవడం. (తరువాత కొన్నాళ్ళకి మా లైబ్రరీ లోనే రాముశ్యాము అని పిల్లల చిలిపి చేష్టలు, వారి అమాయకత్వం ఇతివృత్తం గా వుండే పుస్తకం కనిపించింది. అదికూడా ఆంధ్ర ప్రభ వారపత్రికలోనో, జ్యోతి లోనో ధారావాహిక వస్తే పేజీలు వేరుచేసి కుట్టినదే. రాము శ్యామూ బొమ్మలకింద కధ: అనంత్ పాయ్బొమ్మలు: మోహన్ దాస్ అని వుండేది.) అప్పటి నుంచీ టింకిల్ తప్పనిసరిగా కొనేవాళ్ళం. దానిలో వచ్చే కధలూ, పజిల్స్ శీర్షికలూ, అన్నీ మమ్మల్ని వేరేలోకాలకి తీసుకుపోయేవి. ప్రతీ సారీ ఒక్కో జంతువునో, పక్షినో పరిచయం చేసేవారు.. పులిని కలుసుకొండి.. పాంగోలిన్ ను కలుసుకోండి..అంటూ..!! నీటిగుర్రం, నీటి ఏనుగు, క్రోక్విల్, మొదలైన వాటిని నిజం గా చూస్తున్నామా అన్నంత బాగుండేవి బొమ్మలూ, వ్యాఖ్యానం. బొమ్మలు ఎంత బాగుండేవో వ్ర్రాత కూడా అంత చక్కగానూ వుండేది.

అలాగే అమరచిత్ర కథల విషయానికొస్తే మన పురాణ పురుషులనీ, దేశనాయకులనీ, జాతక కథలనీ, జానపదాన్నీ ఒకటేమిటి మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను సమస్తం తన బొమ్మల పుస్తకాలలో నిక్షిప్తం చేసారు..పాయ్ అంకుల్ గా పిలువబడే శ్రీ అనంత్ పాయ్ !! క్లాసు పుస్తకాలలో ఇలాంటివి కనబడక పోవడం చేత వాటికన్నా ఒక్కోసారి వీటినుంచీ తెలుసుకొన్న విషయాలే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి. ఏదేమైనా చిన్నప్పటినుంచీ మాతరంలో ఒక మరపురాని అనుభూతిని మిగిల్చి ఒకతరం మొత్తానికి వారి దేశం పట్ల మమకారాన్నీ, అభిమానాన్నీ, గౌరవాన్నీ పాదుకొల్పగలిగిన శ్రీ అనంత్ పాయ్ నిజంగా ధన్యుడు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా ప్రార్ధిద్దాం.


అలాగే వారి కృషిని మరిన్ని తరాలకు అందేలా నేటి సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు దూసుకెళ్తున్న అమరచిత్రకథ మరియు టింకిల్ యాజమాన్యాలు అభినందనీయులు. అలాగే మన తరాల్లో పరిచయమైన అవే బొమ్మలని, ఏనిమేషన్ లో కూడా అందుబాటులోకి తేవడం ద్వారా నేటి తరం బాలబాలికలకు మరింత చేరువయ్యారు. పాశ్చాత్య సంస్కృతి తుఫానులో కొట్టుకుపోతున్న తరం బాలసాహిత్యానికి పుస్తకాలు చుక్కాని కాగలవనడంలో సందేహం లేదు.

బొమ్మల కథల పై మరింత సమాచారం కోసం శ్రీ సురేఖ గారి రేఖాచిత్రం బ్లాగులో చూడండి. వారికి నా ధన్యవాదాలు.

http://www.amarchitrakatha.com/

http://www.amarchitrakatha.com/products/Tinkle

పూర్తిగా చదవండి...

Monday, March 14, 2011

జరిగింది..విగ్రహ విధ్వంసమా లేక...

సంఘటన జరిగినప్పటి నుంచి.. రెండుప్రాంతాల వారి బ్లాగులూ చదువుతూనే వున్నాను. ఇక్కడ విషయాన్ని రెండు పక్షాలవారూ రెండు దృక్కోణాలనుంచి చూస్తున్నారని పిస్తోంది. క్షమించాలి.. మమందరం మొదట భారతీయులం ఎలాగో..అలాగే మన ప్రాంతీయత కంటే ముందు మనందరం తెలుగు వాళ్ళం అని నమ్మేవాడిని నేను. రెండు విరుద్ధ భావనల్నిప్రతిబింబించే వాదనలు చేస్తున్నపక్షాలని రెండు గా వేరుచేసి చూడవలసి వస్తోంది. ఇక్కడ రెండు పక్షాలు అంటే.. తెలంగాణా, సీమాంధ్ర అని కాదని మనవి. ఆ విగ్రహాలకి ప్రాంతీయతని ఆపాదించకుండా తెలుగు జాతి సాంస్కృతిక వారసత్వానికీ, వారు ప్రతిపాదించిన విలువలకీ ప్రతీకలుగా భావించే వారు (ఇలాంటి భావన కలిగిన తెలంగాణాకు చెందినా వారి బ్లాగులను చూసాను) ఒక పక్షం అయితే.. ఆ విగ్రహాలని కేవలం ప్రాణం లేని బొమ్మలుగా, తమ మీద రుద్దబడిన తమది కాని చరిత్ర గా మాత్రమే భావించి తీవ్రమైన భావావేశం తో పరుష పదజాలం తో మొదటి పక్షం మీద విరుచుకు పడుతున్నపక్షం రెండోది. ఈ 'బ్లాగ్యుద్ధం' ఎంతదాకా వెళ్లిందంటే ఆఖరుకి దేవుళ్ళనీ..ఫ్లై ఓవర్లనీ కూడా ప్రాంతీయత పేరుతో వేరుచేసే దాకా..!!



ఇక్కడ ఈ రెండో వర్గం చేసిన, చేస్తున్నయాగీ, అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు ఉంది. తెలుగు భాషా సౌరభాన్ని గుబాళింప జేసి, వారి రచనల ద్వారా తెలుగు ప్రజల మనోవికాసానికి కృషి చేసిన ఆ వైతాళికులు విశ్వమానవులు. వారు ప్రతిపాదించిన విలువలను వారి జీవితం లో ఆచరించి చూపిన పుణ్యాత్ములు. అలాంటి మహాత్ముల విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ద్వారా వీరు సాధించ దలచిందేమిటి..? ఆ రోజు, మరియు దానికి ముందు జరిగిన సంఘటనల నేపధ్యం లో ఈ విగ్రహ ధ్వంసం..క్షణికావేశం లో జరిగినదే అని సమాధాన పడదామన్నా..దాని తరువాత వస్తున్న సమర్ధింపులు ఏ రకంగా అంగీకారయోగ్యం..?? ఇదంతా ఈ రాజకీయ నాయకులు వారి ఉనికి కోసం చేసే దిగజారుడు చర్యలనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తపించేవారి ఆవేదనని అర్ధం చేసుకున్నా, ఇలాంటి వికృత చేష్టలకి పాల్పడే వారిని రకంగా అర్ధం చేసుకోవాలో తెలియదు. పైగా వారు సమస్యకి మూల కారణమైన రాజకీయ నాయకులని వదలి కవులు, కళాకారుల విగ్రహాలను కూలగోట్టడం..ఎక్కడి వీరోచిత కార్యమో అర్ధంకాదు.


హిందూ - ముస్లిం లు ఇక్యం గా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని, మహమ్మద్ అలీ జిన్నా యొక్క కుటిల రాజనీతి ఏ రకంగా కలుషితం చేసిందో మనకు తెలుసు. మనస్సులో విషబీజాలు నాటి, రెండు మతాల మధ్య సృష్టించిన అగాధంలో తమ విజ్ఞతని పాతిపెట్టి, కలసి పని చేసిన మిత్రులు, సోదరుల్లా మెలిగిన వారే తోటివారి రక్తాన్ని కళ్ళ జూసే స్థాయికి దిగజారి మానవత్వాన్ని మంటగలిపిన ఉదంతాలు మనం చూశాం. విద్వేషం..అది రగిల్చిన వారికంటే అనుభవించిన వారికే ఎక్కువ ప్రమాదకరం.

ప్రత్యేక రాష్ట్రం కోసం సమిధలైన వారిని గురించి బాధపడని మానవతావాదులకు ఈ ప్రాంతం లో కొదవు లేదు. 600 మంది అమరులైనారని తలచుకున్న ప్రతీసారీ గుండెలు పిండినట్టవుతుంది. అదే రీతిలో ఏమాత్రం ఉద్యమానికి సంబంధం లేని వారి విగ్రహాలను కూలగొట్టడం కూడా బాధ కలిగిస్తుంది. కానీ ఈ చర్య వల్ల విచక్షణ మర్చిపోయి తెలంగాణాకు చెందిన మన సోదరులనందరినీ ఒకే గాటన కట్టి, ద్వేషపూరిత భావాలతో మన మనసుల్ని కలుషితం చేసుకోవడం..ఏ రకం గానూ సమర్ధనీయం కాదు. కుల,మత,వర్గ, రహితమైన.., ప్రాంతీయ విభేదాలను దరిచేరనివ్వని.., సమ సమాజ స్థాపనకై కలలుగన్న ఆ మహనీయులకు 'లేని' ప్రాంతీయతని ఆపాదిస్తే అది విశ్వవ్యాప్తమైన వారి వ్యక్తిత్వాన్ని అంగుష్ఠ మాత్రం చెయ్యబూనటమే. గాంధీని, తిలక్ నీ, అంబేడ్కర్ని, వీర శివాజీనీ, ఏదో ఒక మతానికీ, వర్గానికీ, కులానికీ, ప్రాంతానికీ మాత్రమే ప్రతినిధులుగా ఆలోచించే సంకుచిత మనస్తత్వం వల్ల మన తరువాతి తరానికి మనం ఇస్తున్నది ఏమిటో తెలుసుకో గలిగితే వొళ్ళు గగుర్పొడుస్తుంది. నాయకులుగా మనం నమ్మిన వారి విలువలని పంచటం లేదు సరికదా.. వైషమ్యాలని పెంచి వారికి విషాన్ని పంచుతున్నాం. ప్రేమ, సహనం, సౌభ్రాతృత్వం, లాంటి భావాలకి వారిని దూరం చేస్తున్నాం. అరవయ్యేళ్ళు అయినా ఇంకా మన పొరుగు దేశానికి చెందిన వారు ఇంకా మన మీద విరుచుకు పడడానికి ప్రయత్నిస్తున్నారంటే.. వారి భావజాలం యొక్క మూలాలు (విత్తనం), ఎంత ప్రమాదకరమైనవో తెలుస్తోంది.


తమ చరిత్ర నిర్మించుకోవాలనే ఆరాటం లో మన మూలాలను ప్రక్కవారివి గా భావించి, వాటి సమాధులని తమకు పునాదులుగా వాడుకోవాలని చూస్తే చరిత్ర హీనులు కాకతప్పదు. వేరు పడాలనే ఒకే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడు చెప్పే 'మా ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేదు..కనుక వేరు పడాలి అనుకుంటున్నాం.. ' లాంటివాక్యాలు రేపు..రాష్ట్రం ఏర్పడ్డాక మండలాల వారీగా ప్రాతినిధ్యాలకి జవాబు చెప్పేటప్పుడు.. మనమంతా ఒకటే కదా..అని పాలకులు అనకా తప్పదు ..! "లేదు.. మాకు ప్రత్యేకం ఉండాల్సిందే " అని పోరుపెట్టే చోటా నాయకులకూ కొదవుండదు.

ఏదైనా మనం చూసే దృష్టిలోనే మనం గ్రహించే విషయం ఉంటుందనేది సుస్పష్టం..! అందమైన జాబిల్లిని మారుతున్న కళలతో చూడవలసి రావడం భూమినుంచి చంద్రుడిని మనం చూసే స్థిరమైన దృక్కోణం వల్లనూ, మరియు ఖగోళ భౌతిక శాస్త్ర నియమాల వల్లనే అనేది జగద్విదితం. కానీ చంద్రుడికి తన వెలుగులను పూర్తిగా పంచటం లేదని సూర్యుడి మీద అలుక పూనటం అవివేకం.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)